ఎవరి సిఫార్సుతో వచ్చారో చెప్పేసారు: కొలువు తీరిన టీటీడీ బోర్డు: పలు కీలక నిర్ణయాలు..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. శ్రీవారి ఆలయం గరుడాళ్వార్ సన్నిధిలో పాలకమండలి సభ్యులతో జేఈవో బసంత్కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి శ్రీవారి సేవకుడిగా అవకాశం దక్కటం పైన సంతోషం వ్యక్తం చేసారు. కొందరు సభ్యులు తమకు ఎవరి ద్వారా అవకాశం వచ్చిందో వారి పేర్లు చెప్పి మరీ ధన్యవాదాలు చెప్పారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలకమండలి తొలిసమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై చర్చ జరిగింది.
వారి అనుగ్రహంతోనే అవకాశం..
ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన వారు ప్రమాణ స్వీకారం చేసారు. వారికి ఈ పదవులు దక్కటానికి కారణమైన వారికి ధన్యవాదాలు చెప్పారు. ప్రముఖ పారిశ్రామిక వేత జూపల్లి రామేశ్వరరావు తనకు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అనుగ్రహంతో ఈ అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. స్వామి వారి అనుగ్రహంతో సామాన్య భక్తులకు సేవ చేసే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మరో సభ్యుడు నాదెండ్ల సుబ్బారావు సైతం విశాఖ శారదా పీఠాధిపతులు చెప్పడం.. తనకు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాలినడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.
రెండో సారి అవకాశం దక్కింది..
టీటీడీ పాలక మండలిలో తమ కుటుంబానికి రెండవసారి చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి అన్నారు. స్వామి వారికి సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి జగన్కి కృతజ్ఞతలు చెప్పారు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని. దేవస్థానంలో ఎటువంటి అవినీతికి తావులేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని మేడా చెప్పుకొచ్చారు. తమిళనాడు నుండి బోర్డు సభ్యురాలిగా నియమితులైన నిషితా రెడ్డి శ్రీవారి ఆశీస్సులతో తనకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని... భక్తులకు సేవలందించేందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉండాలని స్వామి వారిని ప్రార్ధించానని వివరించారు. శేఖర్ రెడ్డి సైతం ప్రమాణ స్వీకారం చేసారు. తన పైన జరుగుతున్న ప్రచారాన్ని ఇక ఆపేయాలని ప్రచారం జరుగుతున్నట్లుగా తాను వందల కోట్లు వ్యవహారంలో లేనని చెప్పుకొచ్చారు.
అమరావతి ఆలయానికి రూ. 36 కోట్లకు కుదింపు
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రమణధీక్షితులు వ్యవహరం కోర్టు పరిధిలో వున్నందున ఆ అంశంపై పాలకమండలిలో చర్చించలేదని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. అవిలాల ట్యాంక్ అబివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి మల్లిస్తామన్నారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటిని నియమిస్తామని ఆయన తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి గత ప్రభుత్వం కేటాయించిన రూ.150 కోట్లను ప్రస్తుత అవసరాల మేరకు రూ. 36 కోట్లకు కుదింపు చేసినట్లు చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిని స్మార్ట్ సిటిగా ప్రకటించిన తరువాత టీటీడీ నిధులు కేటాయింపు చెయ్యడం సమంజసం కాదన్నారు. గరుడ వారధికి ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం నిధులు కేటాయిస్తామని బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వివరించారు.