టీటీడీలో కరోనా టెన్షన్.. 10 మందికి పాజిటివ్.. రేపు బోర్డు అత్యవసర సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాజా పరిస్థితులపై,టీటీడీ తిరుమలకు వస్తున్న భక్తుల విషయంలో తీసుకుంటున్నచర్యలపై పాలకమండలి సమావేశంలో చర్చించనున్నట్లు గా తెలుస్తోంది.
టీటీడీ సిబ్బందికి 10మందికి కరోనా
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందిలో పది మందికి కరోనా సోకింది. బాధితుల్లో నలుగురు భద్రతా సిబ్బందికి, నలుగురు వాయిద్యకారులు అయిన వారికి, ఒక అర్చకునికి,ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం.తిరుమలకు కొద్దికొద్దిగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది టీటీడీ.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీటీడీ బోర్డు సమావేశం
ఈ సమయంలో టిటిడి సిబ్బందికి కరోనావైరస్ సోకడంతో తాజాపరిస్థితులపై,అలాగే భక్తుల ఆరోగ్య రక్షణపై టీటీడీ సమావేశంలో చర్చించనున్నారు. లాక్ డౌన్ అనంతరం తిరుమల శ్రీవారి దర్శనాలను ప్రారంభించిన పాలకమండలి పెరుగుతున్న భక్తులకనుగుణంగా తగు నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు.అందులో భాగంగా టీటీడీ పాలక మండలి సమావేశం కరోనా కట్టడి నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని రేపు నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.
భక్తులు, సిబ్బంది విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
ఇప్పటికే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు కరోనా ఎఫెక్ట్ పడుతున్న నేపధ్యంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమలలో పని చేసే ఉద్యోగుల నుంచి రోజుకు 100 కరోనా టెస్టు శాంపిల్స్ తీయాలని అధికారులను ఆదేశించారు.ఈ టెస్ట్ ల రిపోర్టులు 24 గంటల్లోగా వచ్చే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులు వారం రోజులు ఒకే చోట పనిచేసేలా డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా క్వారంటైన్ అవసరమైతే మాధవంలో ఏర్పాట్లు చెయ్యనున్నారు.
భక్తుల రద్దీ పెరగటంతో అత్యవసర బోర్డు మీటింగ్
కరోనావ్యాప్తి కారణంగా మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్11 నుంచి ప్రారంభించిన టిటిడి ముందు 6 వేల మందితో ప్రారంభించిన శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేసింది.భౌతికదూరం,మాస్కులు ధరించడం, వైద్య పరీక్షలు చేయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఎప్పటికప్పుడు శానిటేషన్ వంటి అన్ని జాగ్రత్తలూ టీటీడీ తీసుకుంటోంది. ఈమధ్య కాలంలో శ్రీవారి దర్శనం కోసం ప్రజలు ఎక్కువగా రావడంతోపాటు, కరోనాకేసుల నేపథ్యంలో రేపు అత్యవసర టీటీడీ బోర్డు మీటింగ్ జరగనుంది.