జగన్ ట్రీట్మెంట్ మొదలు: దారికొచ్చారు.. పుట్టా సుధాకర్ రాజీనామా: 16 మందితో టీటీడీ కొత్త బోర్డు..!
ముఖ్యమంత్రి జగన్ ట్రీట్మెంట్ పని చేసింది. మొండి చేస్తున్న టీడీపీ నేతలు దారిలోకి వస్తున్నారు. చేతనైతే తనను టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తప్పించుకోవాలని..తాను మాత్రం రాజీనామా చేయనని పుట్టా సుధకార్ అనేక సార్లు చెబుతూ వచ్చారు. అయితే, రాజీనామా చేయని పాలక మండళ్ల పైన ఆర్డినెన్స్ ద్వారా వేటు వేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో..సుధాకర్ యాదవ్ ఇప్పటి వరకు మొండికేసినా..ఎట్టకేలకు రాజీనామా చేయక తప్పలేదు. ఇక, కొత్త ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి నియామకానికి లైన్ క్లియర్ అయింది. ఆయనతో పాటుగా 16 మంది సభ్యులతో టీటీడీ కొత్త బోర్డు నియామకం కానుంది.
దారికొచ్చిన సుధాకర్ యాదవ్..
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర యాదవ్ ఎట్టకేలకు రాజీనామా చేసారు. చంద్రబాబు హయాంలో టీటీడీ ఛైర్మన్గా నియమితులైన సుధాకర్ యాదవ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా రాజీనామా చేయటానికి సిద్దపడేలేదు. తాను శ్రీవారి ముందు ప్రమాణ స్వీకారం చేసానని..సెంటిమెంట్ కావటంతో ప్రభుత్వమే తనను టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తప్పించాలని సవాల్ చేసారు. ఇప్పటికే బోర్డు నుండి ఏడుగురు సభ్యులు రాజీనామా చేసారు. అయితే సుధాకర్ యాదవ్ మాత్రం రాజీనామా చేయకుండా సాగదీసారు. ఇదే సమయంలో ఈరోజు ఉదయం ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుమలలో కీలక ప్రకటన చేసారు. టీటీడీకి కొత్త బోర్డును త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని..రాజీనామా చేయని పాలకమండళ్లను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని మంత్రి స్పష్టం చేసారు. దీంతో..తప్పని పరిస్థితుల్లో సుధాకర్ యాదవ్ రాజీనామా చేసారు.
జగన్ తరహా ట్రీట్మెంట్..
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ హయాంలో నియమాకం జరిగి..ఇప్పటికీ రాజీనామా చేయని పాలకమండళ్ల రద్దుకు ఆర్దినెన్స్ ద్వారా వేటు వేయాలని నిర్ణయించారు. దీంతో..ముందుగా రెవిన్యూ శాఖ నుండి సమాచారం ఇవ్వాలని..తప్పుకోని వారి విషయంలో ఆర్డినెన్స్ ద్వారా తప్పించాలని జగన్ ఆదేశించారు. అందులో పుట్టా సుధాకర్ యాదవ్ విషయంలో జగన్ తొలి నుండి సీరియస్ గానే ఉన్నారు. టీడీపీ ముఖ్య నేత యనమల రామకృష్ణడు వియ్యంకుడు కావటంతో పాటుగా పోలవరం కాంట్రాక్టర్గా ఉండటంతో ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురి కావటం కంటే పదవి నుండి తప్పుకోవటం మంచిదని సుధాకర్ యాదవ్ భావించినట్లు తెలుస్తోంది. దీంతో..ఆయన ఎటువంటి కారణాలు చెప్పకుండానే నేరుగా టీటీడీ ఈవోకు తన రాజీనామా లేఖను పంపారు.
సుబ్బారెడ్డి..కొత్త బోర్డుకు లైన్ క్లియర్..
ఇప్పుడు సుధాకర్ యాదవ్ రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ నూతన ఛైర్మన్గా నియామకానికి ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సీఎం జగన్ ఇక టీటీడీ బోర్డు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. బోర్డు ఛైర్మన్గా సుబ్బారెడ్డి పేరు ఇప్పటికే జగన్ ఖరారు చేసారు. దీంతో..ఇక మరో 13 మంది సభ్యులను..ముగ్గురు అధికారులతో బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. పార్టీలో సీనియర్లుగా ఉంటూ కేబినెట్లో స్థానం దక్కని వారికి సీఎం జగన్ నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇస్తున్నారు. ఇందులో భాగంగా మూడు రీజియన్లను దృష్టిలో ఉంచుకొని జగన్ టీటీడీ బోర్డుకు తుది రూపు ఇవ్వనున్నారు. ఒకటి లేదా రెరండు రోజుల్లో టీటీడీ కొత్త బోర్డు నియామకం జరిగే అవకాశం ఉంది.