టీటీడీ సప్తగిరి మేగజైన్తో పాటే క్రైస్తవ సువార్త పుస్తకాలు: పోలీసులకు ఫిర్యాదు: కేసు నమోదు..
తిరుపతి: కోట్లాది మంది హిందువులు కలియుగ వైకుంఠంలా భావించే తిరుమలపై దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం తీవ్రమైందంటూ ఇదివరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసిన కొందరు నెటిజన్లపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్టు చేశారు. కఠిన చట్టాల కింద విచారణ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. తిరుమలపై తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట పడట్లేదు.
తాజాగా- టీటీడీకి చెందిన సప్తగిరి మ్యాగజైన్ను కొనుగోలు చేసిన శ్రీవారి భక్తులకు క్రైస్తవ సువార్త పుస్తకాలను పంపిణీ చేస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. గుంటూరుకు చెందిన ఓ భక్తుడు పోస్టల్ కవర్లో సప్తగిరి మేగజైన్తో పాటు సజీవ సువార్త అనే క్రైస్తవ పుస్తకాన్ని కూడా అందుకున్నాడు. టీటీడీ పవిత్రతను మంటగలిపేలా ఈ వ్యవహారం ఉందనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఘటన కాస్త వైరల్గా మారింది.
దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు ఆరోపించారు. వేలాదిమందికి సప్తగిరి మేగజైన్లు అందుతుంటాయని, వారిందరిలోకి ఒక్కరికే సప్తగిరితో పాటు సజీవ సువార్త పుస్తకం ఎలా అందిందనే కోణంలో దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపారు.
టీటీడీ ప్రతిష్ఠను, శ్రీవారి ఆలయ పవిత్రతతను దెబ్బ తీయడానికి కొంతమంది ఉద్దేశపూరకంగా కుట్ర పన్నారని చెబుతున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేయాలని తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సప్తగిరి మేగజైన్ను గుంటూరుకు చెందిన భక్తుడికి క్రైస్తవ పుస్తకం ఎలా అందిందనే విషయంపై తాము అంతర్గతంగా కూడా విచారణ చేపట్టామని అన్నారు. సప్తగిరి మేగజైన్లను భక్తులకు పోస్టల్ అందిస్తామని చెప్పారు.
సప్తగిరి మేగజైన్లను పుస్తకాల రూపంలో తాము పోస్టల్ అధికారులకు పంపిస్తామని, దాన్ని బుక్ పోస్ట్ రూపంలో డెలివరి చేస్తారని అన్నారు. ఈ మేగజైన్లను ప్యాక్ చేయడానికి టీటీడీలో ఎలాంటి ప్రత్యేక విభాగం లేదని స్పష్టం చేశారు. ఫలితంగా తప్పు ఎక్కడ చోటు చేసుకుందనే విషయంపై ఆరా తీస్తున్నామని టీటీడీ అధికారులు అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం ఆదేశించామని, అలాగే అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.