తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... టీటీడీ కీలక నిర్ణయం... ఈసారి కూడా ఏకాంత సేవే...
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం కావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి సాలకట్ల బ్రహ్మోత్సవాల మాదిరి గానే ఈ బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ భరత్ గుప్తా, టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, డీఐజీ కాంతి రాణా, జేఈఓ బసంత్కుమార్, సీవీఎస్ఓ గోపినాథ్జెట్టిలతో జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరు వీధుల్లో శ్రీవారి ఊరేగింపు చేపట్టాలని భావించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. భక్తుల ఆరోగ్యం రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి అధ్యక్షతన టీటీడీ ఉన్నతాధికారులు పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఒక నిర్ణయానికి వచ్చారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల... మతపరమైన కార్యక్రమాలకు 200 మందికి మించి రాకూడదన్న నిబంధనల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Recommended Video
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఆలయానికే పరిమితం కావడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు. అయితే ప్రత్యక్షంగా చూసే వీలు లేకపోయినా ఎస్వీబీసీ టీవీ ఛానెల్ ద్వారా భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించవచ్చు.