టీటీడీలో తొలి వికెట్: ఆస్తుల అమ్మకం సమాచారం లీక్: ఎస్టేట్ అధికారిపై సస్పెన్షన్ వేటు
తిరుపతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకపు విషయంలో తొలి వికెట్ పడింది. ఈ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మీడియాకు లీక్ చేసిన టీటీడీ ఎస్టేట్ అధికారి వీ దేవేంద్ర రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారని, అందువల్లే ఆయనను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని వివరించింది. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూ (దేవాదాయం) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
తమిళనాడులో శ్రీవారికి చెందిన నిరర్థక ఆస్తులను టీటీడీ అధికారులు అమ్మకానికి పెట్టినట్లు కొద్దిరోజుల కిందట పెద్ద ఎత్తున వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా ఒకరోజు నిరాహార దీక్షలను చేపట్టాయి. శ్రీవారి ఆస్తుల అమ్మకాలపై పలు ధార్మిక సంఘాల ప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు మండిపడ్డారు. ఇది సరికాదంటూ అభిప్రాయపడ్డారు.
అనంతరం- ఈ ప్రతిపాదనలను టీటీడీ పక్కన పెట్టేసింది. టీటీడీ ఆస్తుల అమ్మకానికి అనుమతి ఇచ్చేలా 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ జగన్ సర్కార్ మరో కొత్త జీవోను జారీ చేసింది. ఫలితంగా- భవిష్యత్తులో టీటీడీ ఆస్తులను అమ్మకానికి వీల్లేకుండా ఆదేశాలను ఇచ్చింది. కాగా- ఈ వ్యవహారం మొత్తానికి కారణం.. నిరర్థక ఆస్తుల అమ్మకాల సమాచారం ఎలక్ట్రానిక్ మీడియాకు పొక్కడమేనని టీటీడీ అధికారులు భావించారు.
Recommended Video
దీనిపై అంతర్గతంగా విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఎస్టేట్ విభాగం అధికారులను విచారించారు. దేశవ్యాప్తంగా టీటీడీకి ఉన్న స్థిరాస్తులను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన విభాగం ఇది. మీడియాకు సమాచారం లీక్ చేసిన వ్యవహారంలో ఎస్టేట్ అదికారిగా పనిచేస్తోన్న డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు అధికారి దేవేంద్ర రెడ్డి ప్రమేయం ఉన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా దేవేంద్ర రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు జేఎస్వీ ప్రసాద్ వెల్లడించారు.