రూ.47.92 కోట్లు: తలనీలాలకు ధర, వేలం వేసిన టీటీడీ
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆలయ హుండీలో ఆదాయం రాను రాను పెరుగుతోంది. దీంతోపాటు తలనీలాలతో కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. దేశం నలుమూలల నుంచి తిరుమల వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఆన్ లైన్ లో వేలం వేస్తుంది.
తలనీలాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈసారి టీటీడీ 21,100 కిలోల తలనీలాలను వేలంలో ఉంచింది. మొత్తం రూ.47.92 కోట్ల ధర పలికింది. వేలం వేసిన తలనీలాల్లో వివిధ సైజులు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి తలనీలాలను గ్రేడింగ్ చేస్తారు. ఫస్ట్ గ్రేడ్- 27 అంగుళాల తలనీలాలు, సెకండ్ గ్రేడ్- 19 నుంచి 26 అంగుళాలు, థర్డ్ గ్రేడ్- 10 నుంచి 18 అంగుళాలు, ఫోర్త్ గ్రేడ్- 5 నుంచి 9 అంగుళాలు, ఫిఫ్త్ గ్రేడ్- 5 అంగుళాల కంటే తక్కువ ఉంటాయి.
టీటీడీ వేలం సమయం వరకు ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విగ్గుల తయారీ కేంద్రాల్లో ఈ తలనీలాలను ఉపయోగిస్తారు. అందుకే అంత డిమాండ్ ఉంటుంది. భక్తులు కూడా ఏటా లక్షలాది మంది సందర్శిస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు.