TTD: తిరుమల ఉత్తరద్వార దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం: కమిటీ ఏర్పాటు.. !
తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి నుంచి వరుసగా 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించాలన్న నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాయిదా వేసింది. దీన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించనుంది. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉండాలనే విషయంపై ఏకపక్షంగా వ్యవహరించకూడదని భావిస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. రెండురోజుల పాటే ఉత్తర ద్వారా దర్శనాన్ని కల్పించబోతోంది. దీనికి తగ్గన ఏర్పాట్లు చేసింది.
ఆనవాయితీ కొనసాగింపు..
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల సహా అన్ని ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనాన్ని కల్పించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఆ సౌకర్యాన్ని కల్పిస్తుంటారు అర్చకులు. తిరుమల రెండు రోజుల పాటు ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఏకాదశి, ద్వాదశి.. ఈ రెండు రోజుల్లో శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తారు భక్తులకు.
హైకోర్టులో పిటీషన్..
ఒక్క తిరుమలలో మాత్రం ఉత్తర ద్వార దర్శనాన్ని పదిరోజుల పాటు పొడిగించాలనే అంశం హైకోర్టు దాకా వెళ్లింది. ఈ ఏడాది ఉత్తర ద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచేలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదేశాలు జారీ చేయాలంటూ రాఘవన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకునేలా చేయాలని పేర్కొన్నారు.
అప్పటికప్పుడు అంటే..
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పండగ సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. దీనిపై టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఉత్తర ద్వార దర్శనాన్ని పదిరోజుల పాటు పెంచేలా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని, అందుకు తగ్గ ఏర్పాట్లను చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. అదే అభిప్రాయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ అవకాశాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
వచ్చే ఏడాది నుంచి..
వైకుంఠ ద్వారాన్ని ఎన్ని రోజులు తెరవాలనే అంశంపై తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. పీఠాధిపతులు, ఆగమ పండితులతో కమిటీని ఏర్పాటు చేస్తామని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా- ఈ నెల 20వ తేదీ నుంచి ఉచిత లడ్డూలను అందజేయనున్నట్లు చెప్పారు.