తిరుమలలో శ్రీవారి దర్శనాలు... టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన...
కరోనా ప్రభావం తగ్గేవరకూ తిరుమలలో దర్శనాల సంఖ్య పెంచే యోచన లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆన్లైన్లో శ్రీవారి కల్యాణోత్సవ టికెట్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. టికెట్లు తీసుకున్న భక్తుల గోత్రనామాలతో తిరుమలలో కల్యాణోత్సవం జరుపుతామన్నారు. అలాగే పోస్టు ద్వారా కల్యాణోత్సవ అక్షతలు,వస్త్రాలు పంపుతామన్నారు. తిరుమలలో కరోనా బారినపడిన అర్చకులు,సిబ్బంది కోలుకున్నారని చెప్పారు. కరోనా నేపథ్యంలో తిరుమలలో ప్రస్తుత పరిస్థితులపై గురువారం వైవీ సుబ్బారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సాధారణ రోజుల్లో అయితే నిత్యం ఇసుకేస్తే రాలనంత జనంతో తిరుమల రద్దీగా ఉండేది. దర్శనాలైనా,గదులైనా గంటల తరబడి నిరీక్షణ తప్పేది కాదు. కానీ కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు మారిపోయింది. తిరుమల కొండకు వెళ్లే శ్రీవారి మెట్ల మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. అలిపిరి కాలినడక మార్గాన్ని ఉదయం 6గం. నుంచి సాయంత్రం 4గం. వరకు తెరిచి ఉంచుతున్నారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి 20న మూతపడ్డ తిరుమల దేవస్థానం తిరిగి జూన్ 11న తెరుచుకుంది. సాధారణ రోజుల్లో అయితే నిత్యం 60వేల మంది శ్రీవారిని దర్శించుకునేవారు. ప్రస్తుతం ప్రతీరోజూ 6వేల మందికి మాత్రమే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. లడ్డు కౌంటర్ల వద్ద కూడా భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో నిత్యం 67 లడ్డు కౌంటర్లు ఉంటే... ప్రస్తుతం 25 మాత్రమే ఉన్నాయి.