శ్రీవారి ఆస్తులపై టీటీడీ ఛైర్మన్ మరో కామెంట్: ఆ దిశగా కసరత్తు చేస్తున్నామంటూ: అన్ని వివరాలూ
తిరుపతి: తమిళనాడులో అన్యాక్రంతమౌతున్నాయని అనుమానిస్తోన్న శ్రీవారికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకం వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అవి కాస్తా రాజకీయ రంగును పులుముకొనడంతో పెను దుమారం చెలరేగింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. చివరికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం దీన్ని తప్పు పట్టేంత వరకూ వెళ్లింది అంశం. ఈ దుమారం తగ్గీ తగ్గక ముందే మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంటోంది టీటీడీ.
వైఎస్ జగన్ బెస్ట్ ఫ్రెండ్, తమిళ నటుడు సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ: తర తమ భేదాల్లేవ్
శ్వేతపత్రం కోసం
శ్రీవారికి చెందిన ఆస్తుల వ్యవహారంలో పారదర్శకంగా వ్యవహరించాలని భావిస్తోంది. టీటీడీకి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా విక్రయించకుండా పకడ్బందీగా ఏర్పాట్లను చేసిన అధికారులు.. స్వామివారి ఆస్తిపాస్తులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. టీటీడీ తదుపరి పాలక మండలి సమావేశంలో గానీ లేదా వచ్చే ఏడాది వార్షిక బడ్జెట్ సందర్భంగా గానీ, దీన్ని విడుదల చేయవచ్చని తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయి కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా స్వామివారికి ఉన్న స్థిర, చరాస్తులు, బ్యాంకుల్లో నిల్వ ఉన్న డిపాజిట్ల వివరాలన్నింటినీ ఇందులో పొందుపర్చనుంది.
పారదర్శకత కోసం..
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి చెందిన ఆస్తుల వివరాల విషయంలో పారదర్శకంగా ఉండాలనే కారణంతోనే తాము శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. టీటీడీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదని, భక్తులకు వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు. ఇదివరకే కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు ప్రముఖులు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు తాము శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని, దీనిపై త్వరలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ట్రయల్ రన్ విజయవంతంగా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్లో ప్రకటించిన సడలింపులక అనుగుణంగా శ్రీవారి దర్శనాన్ని పునఃప్రారంభించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ట్రయల్ రన్ ప్రారంభించిన అనంతరం ఆయన తిరుమలలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తొలి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులు, 10వ తేదీన తిరుమల స్థానికులతో దర్శనాల ట్రయల్ రన్ నిర్వహిస్తామని అన్నారు. తొలి రోజు ట్రయల్ రన్ విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. క్యూలైన్ల నిర్వహణపై అవగాహన వచ్చిన తర్వాత 11వ తేది నుండి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని అన్నారు.
12 నుంచి 15 వేల వరకు
ఇంతకుముందు- ఒక గంట వ్యవధిలో ఆరు నుంచి ఏడు వేల మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశం ఉన్నట్లు భావించామని, ఈ సంఖ్యను మరింత పెంచడానికి అవకాశం ఉన్నట్లు ట్రయల్ రన్ సందర్భంగా గుర్తించామని అన్నారు. 12 నుంచి 15 వేల మంది వరకు భక్తులకు అనుమతించడానికి అవకాశం ఉండొచ్చని ప్రాథమికంగా నిర్దారించినట్లు చెప్పారు. ఎంత మందికి దర్శనం కల్పించాలనేది త్వరలోనే ప్రకటిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు, రెడ్జోన్లలో ఉన్నవాళ్లు, ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఉన్న రాష్ట్రాల ప్రజలు తిరుమలకు రావద్దని సూచించారు.
ముందస్తు టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే
టోకెన్లను తీసుకున్న భక్తులకు తిరుమలకు చేరుకోవడానికి మాత్రమే అనుమతి ఇస్తామని అన్నారు. టోకెన్లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా వాటిని జారీ చేస్తున్నామని, అలాగే తిరుపతిలోని ప్రధాన పాయింట్లలో టోకెన్లను జారీ చేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. టీటీడీ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తేల్చి చెప్పారు. దీనికోసం ప్రత్యేక సైబర్ వింగ్ అందుబాటులో ఉందని, దాని ద్వారా దుష్ప్రచారాలు చేసే వారిని గుర్తించి కేసులు పెడుతున్నామని అన్నారు.