టీటీడీ జేఈఓ భాస్కర్ ఆకస్మిక బదిలీ: బోర్డు రాజకీయాలకు ఆయన బలి అయ్యారా?
పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంలా భావించే తిరుమలలో అయిదేళ్లుగా వరుసగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్వామివారి తిరువాభరణాలు, పింక్ డైమండ్ చోరీ అయినట్టు వరుసగా వార్తలు రావడం, టీటీడీ బోర్డులో అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు తిష్ట వేయడం, భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నిధులను దారి మళ్లించడం, ఆయా అక్రమాలను టీటీడీ పాలక మండలి వద్ద ప్రశ్నించిన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు బదిలీ వ్యవహారం, తిరుమలలో మందుబాబుల ఆగడాలు, అన్యమతస్తుల ప్రచార కార్యకలాపాలు.. ఇలా ఒక్కటని కాకుండా- వరుసగా అవాంఛనీయ సంఘటనలు నమోదవుతున్నాయి.
తాజాగా- టీటీడీ పర్యవేక్షణలో ఉన్న శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు అమర్చిన మూడు కిరీటాలు మాయం కావడం, వాటిని వెదికే ప్రయత్నంలో ఆలయం ప్రాంగణంలో బీరు బాటిళ్లు కనిపించడం..టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయి. ఇలాంటి సందర్భంలో.. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. సంయుక్త కార్యనిర్వహణాధికారిపై బదిలీ వేటు వేసింది. టీటీడీ జేఈఓగా పనిచేస్తోన్న పోలా భాస్కర్ ను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. భాస్కర్ ను సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించారు. ఆయన స్థానంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతంను నియమించారు.
పోలా భాస్కర్ ఆకస్మిక బదిలీ టీటీడీలో కలకలం రేపింది. హఠాత్తుగా ఆయనను బదిలీ చేయడం వెనుక ప్రభుత్వ పెద్దలు, టీటీడీ బోర్డు ఛైర్మన్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. అమరావతిలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణానికి జరిగిన భూమి పూజ సందర్భంగా ప్రభుత్వం-టీటీడీ మధ్య చెలరేగిన విభేదాలను దృష్టిలో ఉంచుకునే భాస్కర్ ను బదిలీ చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం వల్ల స్వయానా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దేవాదాయ శాఖను పర్యవేక్షిస్తున్నారు.
టీటీడీ కాదది టీడీపీ: అధికార పార్టీ పెద్దలకు బంగారుబాతులా మారిన శ్రీవారి హుండీ
అమరావతిలో ఆలయ భూమిపూజ సందర్భంగా టీటీడీ అధికారులు కేఈ కృష్ణమూర్తిని ఆహ్వానించలేదు. ఫలితంగా- ఆ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. తనను టీటీడీ అధికారులు తీవ్రంగా అవమానించారని కేఈ కృష్ణమూర్తి బహిరంగంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీటీడీ సహా దేవాదాయ శాఖలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కేఈ దుమ్మెత్తిపోశారు. కేఈకి ఆహ్వానం పంపని ఘటనకు పోలా భాస్కర్ ను బాధ్యుణ్ణి చేసింది ప్రభుత్వం. ఆయనపై బదిలీ వేటు వేసింది. సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ గా పెద్దగా ప్రాముఖ్యత లేని శాఖకు బదిలీ చేసింది.
టీటీడీ పాలక మండలి, అర్చకుల మధ్య పెద్దగా సయోధ్య పూరక వాతావరణం లేదు. టీటీడీ పాలక మండలి తీసుకునే రాజకీయపరమైన నిర్ణయాలను అర్చకులు వ్యతిరేకిస్తున్నారు. పాలకమండలి నిర్ణయాలను గౌరవించాల్సి ఉన్నందున.. వారు ఎక్కడా బయట నోరు విపట్లేదు. ఇలా నోరు విప్పిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై పాలక మండలి ఎంత కఠినంగా వ్యవహరించిందో మనకు తెలిసిందే. వంశపారపర్యంగా వస్తోన్న అర్చక వృత్తిని కాదని, 65 సంవత్సరాలకు పదవీ విరమణ అనే నిబంధనను రాత్రికి రాత్రి సృష్టించి, రమణ దీక్షితులకు బలవంతంగా పదవీ విరమణ చేయించారు.
టీటీడీ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని భాస్కర్ వ్యతిరేకించినట్లు సమాచారం ఉంది. కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ సైతం బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించట్లేదని అంటున్నారు. బోర్డు నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉన్నందున.. మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీవారి పోటులో తవ్వకాలు, తిరుచానూరులో పద్మావతి అమ్మవారి నగలు మాయం కావడం, టీటీడీ పర్యవేక్షణలోనే ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చోరీ ఘటనలపై కూడా పోలా భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారని, టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యాన్ని ఆయన ప్రశ్నించారని అంటున్నారు.
తాజాగా- తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం కావడం పట్ల భాస్కర్.. దిగ్భ్రాంతికి గురయ్యారని, ఇది ఇంటిదొంగల పనే అనడానికి ఆయన వద్ద పక్కా సమాచారం ఉందని తెలుస్తోంది. ఆయన నోరు తెరిస్తే, ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే టీటీడీ పాలక మండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్.. జేఈఓను బదిలీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అదే సమయంలో- ఉప ముఖ్యమంత్రి చేసిన విమర్శలను ఆధారంగా చేసుకుని, దాన్ని సాకుగా చూపుతూ భాస్కర్ పై బదిలీ వేటు వేశారట. భాస్కర్ స్థానంలో కృష్ణాజిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం టీటీడీ జేఈఓగా నియమితులయ్యారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈఓ ఏం చేస్తున్నట్టు?
ఇన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఎక్కడా నోరు విప్పిన సందర్భాలు లేవు. నిజానికి- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ఇష్టుడు. అందుకే- తన కళ్ల ముందే ఇన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. అనిల్ కుమార్ సింఘాల్ పెద్దగా పట్టించుకోవట్లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ఆయనను టీటీడీ కార్యనిర్వహణాధికారిగా నియమించారు. సింఘాల్ ఉత్తరాదికి చెందిన వారు. ఆయన స్వరాష్ట్ర పంజాబ్. 1993 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి.
ఒక ఉత్తరాది వ్యక్తిని కార్యనిర్వహణాధికారిగా పగ్గాలు అప్పగించడం.. టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి. ఉత్తరాది వ్యక్తులకు ఆలయ సంప్రదాయాల పట్ల పెద్దగా అవగాహన ఉండదని విమర్శలు వచ్చాయి. అంతెందుకు? జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సైతం.. సింఘాల్ నియామకాన్ని తప్పు పట్టారు. ఆయనను వెనక్కి పిలిపించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. అయినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. సింఘాల్ కు ముందు ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారులే అక్కడ పనిచేశారు.
పీవీఆర్కే ప్రసాద్, ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లం, రమణాచారి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాంబశివరావు వంటి ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారులు టీటీడీ ఈఓలుగా పనిచేశారు. ఇప్పుడున్న అనిల్ కుమార్ సింఘాల్ చిత్తశుద్ధిని కూడా శంకంచలేం. స్వామివారి పట్ల ఆయనకు అపారమైన భక్తి ఉంది. అందుకే- ప్రతి శుక్రవారమూ క్రమం తప్పకుండా ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. అయినప్పటికీ.. టీటీడీ పాలక మండలి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, తీసుకుంటున్న తీర్మానాలను ప్రతిఘటించట్లేదనే అపవాదు ఉంది.