TTD News: వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు కరోనావైరస్ పరీక్షలు
తిరుమల: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం జాగ్రత్త చర్యలు చేపట్టింది. స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో టీటీడీ తగు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను థర్మల్ గన్స్ ఉపయోగించి కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే థర్మల్ గన్స్ వినియోగించడం వల్ల లక్షణాలు బయటపడవు. ఒక్కసారిగా ఈ మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడటంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అయితే ఒక 28 రోజుల వరకు విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు నిషేధం విధిస్తూ టీటీడీ పాలక వర్గం నిర్ణయించింది. కరోనావైరస్ వ్యాప్తి చెందకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. రోజూ 70వేల నుంచి 80 వేల వరుకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కొన్ని ప్రత్యేక పండగల రోజున ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. గత రెండు రోజుల్లో 60వేల నుంచి 65వేల మంది మాత్రమే ఏడుకొండలవాడిని దర్శించుకున్నట్లు సమాచారం. కరోనావైరస్ ప్రభావం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులపై పడిందని ఆ విషయం స్పష్టంగా తెలుస్తోందని టీటీడీ వర్గాలు చెప్పాయి.
ఇక ఆంధ్రప్రదేశ్లో తొలి కరోనా వైరస్ కేసు బయటపడిన నేపథ్యంలో టీటీడీ జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రతి భక్తుడిని థర్మల్ గన్స్తో చెక్ చేస్తోంది. అలిపిరి చెక్ పాయింట్, అలిపిరి పాదాల మండపం, శ్రీవారి మెట్టు, పాదాచారులు నడిచే చోట ఈ థర్మల్ గన్స్ వినియోగించి భక్తులను పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైనా కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే తిరుపతిలోని రుయా హాస్పిటల్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Recommended Video
ఇక అన్న ప్రసాదం కాంప్లెక్స్లో పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక్కడే కాదు వైకుంఠం క్యూకాంప్లెక్స్, కళ్యాణరట్టతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చర్యలు తీసుకున్నారు. ఇక అతిథి గృహాలను శుభ్రం చేసిన తర్వాతే భక్తులు అందులోకి వెళ్లనిస్తున్నారు. తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఐసొలేషన్ వార్డు పెట్టినట్లు చెప్పారు. అంతేకాదు అవసరమైతే తిరుపతిలోని రైల్వేస్టేషన్, బస్ స్టేషన్కు సమీపంలో కూడా ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. ఇక ప్రతి కంపార్ట్మెంట్లో అంతకుముందు 500 మంది భక్తులను పంపేవారని ఇప్పుడు కరోనావైరస్ భయంతో అందులో సగం అంటే 250 మందిని మాత్రమే పంపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.