తిరుమలలో అనూహ్య ఘటనపై విచారణకు ఆదేశించిన టీటీడీ..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుమలలో తాజాగా చోటు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. నో ఫ్లయింగ్ జోన్ గా ఉన్న తిరుమల గగనతలంపై డ్రోన్ సంచరించిన ఉదంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. దీనిపై విచారణకు ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు.
నో ఫ్లయింగ్ జోన్..
తిరుమల.. నో ఫ్లయింగ్ జోన్. ఈ జోన్ లో విమానాలు తిరగడానికి కూడా అనుమతి లేదు. అలాంటి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ను పంపించారు. డ్రోన్ తో శ్రీవారి ప్రధాన ఆలయం మండపం ఆనంద నిలయాన్ని చిత్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఈ వీడియో కనిపించింది.
బాధ్యులపై చర్యలు..
నో ఫ్లయింగ్ జోన్ లో డ్రోన్ ను పంపించి- తిరుమల, ఆనంద నిలయం పరిసర ప్రాంతాలను షూట్ చేయడాన్ని టీటీడీ అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామని తెలిపారు. శ్రీవారి ఆలయం.. నో ఫ్లయింగ్ జోన్ లో ఉందని, విమానాలు, డ్రోన్లు తిరుగాడటానికి అనుమతి లేదని చెప్పారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేయడంపైనా నిషేధం ఉందని అన్నారు.
హైదరాబాద్ సంస్థ..
హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లల్లో అప్ లోడ్ చేసినట్లు గుర్తించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నామని చెప్పారు. తిరుమల గగనతలంలో డ్రోన్ తిరుగాడిన విజువల్స్ ను సోషల్ మీడియాలోకి ఎవరు అప్ లోడ్ చేశారనే విషయాన్ని నిర్ధరించామని, హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ దీన్ని అప్ లోడ్ చేసినట్లు గుర్తించామని అన్నారు.
త్వరలో ఫోరెన్సిక్ రిపోర్ట్..
ఈ డ్రోన్ విజువల్స్ ను నిజంగానే చిత్రీకరించారా? లేక త్రీడీ ఫార్మట్ లో డిజైన్ చేశారా? అనే విషయాన్ని నిర్ధారిస్తామని, త్వరలోనే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి దీనికి సంబంధించిన రిపోర్ట్ అందుతుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఆనంద నిలయంతో పాటు తిరుమలలో డ్రోన్ల చిత్రీకరణకు అనుమతిలేదని వివరించారు. సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.