TTD: తిరుపతి టు తిరుమల: లైట్ మెట్రో రైలు: త్వరలో హెచ్ఎంఆర్ నిపుణుల బృందం.. !
తిరుపతి: తిరుమలను సందర్శించడానికి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ సరికొత్త ప్రాజెక్టునకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. తిరుమలకు వచ్చే వాహనాల రద్దీని నియంత్రించడానికి, భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి లైట్ మెట్రో రైలు వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులను సంప్రదిస్తున్నారు.
వాహనాలు, కాలుష్య నియంత్రణే..
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రెండురోజుల కిందటే హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఛైర్మన్ ఎన్వీఎస్ రెడ్డితో సమావేశం అయ్యారు. తిరుమలను సందర్శించడానికి వచ్చని ఆయనతో వైవీ సుబ్బారెడ్డి పద్మావతి అతిథిగృహంలో సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. తిరుమలకు లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. రోజూ వేలాది సంఖ్యలో వాహనాలు తిరుమలకు వస్తున్నాయని, ఫలితంగా కాలుష్యం కట్టుతప్పుతోందని చెప్పుకొచ్చారు.
లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు సాధ్యసాధ్యాలపై..
వాహనాలను నియంత్రించడానికి లైట్ మెట్రో రైల్ వ్యవస్థను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి ప్రస్తావించగా.. దానికి ఎన్వీఎస్ రెడ్డి అంగీకరించారు. తిరుపతి నుంచి తిరుమలకు లైట్ మెట్రో రైలును నడిపించడానికి గల అవకాశాలు, సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి త్వరలోనే నిపుణుల బృందాన్ని పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిపుణుల నివేదిక అందిన వెంటనే.. డీపీఆర్లను సిద్ధం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
తిరుమలలో ట్రాఫిక్, పార్కింగ్..
వేలాది వాహనాలు 24 గంటల పాటు రాకపోకలు సాగిస్తుండటం వల్ల తిరుమల కొండల్లో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంటోందనే అంశాన్ని టీటీడీ అధికారులు ఇదివరకు పాలక మండలి భేటీల్లోనూ చర్చించారు. దీన్ని నియంత్రించడానికి బ్యాటరీ వాహనాలను కూడా తిరుమలలో భక్తుల సౌకర్యం కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ.. అవి పెద్దగా ఫలప్రదం కాలేదని అంటున్నారు. దీనికితోడు- పార్కింగ్ ఇబ్బందులు కూడా పెరిగిపోయాయి.
లైట్ మెట్రో రైల్ వ్యవస్థతోనే
తిరుపతి నుంచి తిరుమలకు రోప్వే ప్రాజెక్టును తీసుకుని రావడానికి ఇదివరకు ప్రయత్నాలు చోటు చేసుకున్నప్పటికీ.. అవి సఫలం కాలేదు. కనీసం డీపీఆర్ల వరకు కూడా వెళ్లలేదు. రోప్వే సాధ్యపడదని, పైగా దీన్ని ఉపయోగించకునే భక్తుల సంఖ్య పరిమితంగానే ఉంటుందనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. లైట్ మెట్రో రైలు వ్యవస్థ కోసం టీటీడీ అధికారులు కసరత్తు చేపట్టారు.