కరోనా కాటు: తిరుమల అర్చకుడు మృతి, టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి
తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే పలువురు అర్చకులు కరోనా బారినపడగా.. తాజాగా తిరుమలలో కైంకర్యాలు నిర్వహించే అర్చకులు ఒకరు గురువారం కన్నుమూశారు.
నాలుగు రోజుల క్రితం తిరుమల పద్మావతి కరోనా ఆస్పత్రిలో చేరిన శ్రీనివాసాచార్యులు మృతి చెందినట్లు వైద్యులు గురువారం వెల్లడించారు. కరోనా సోకడానికి ముందే మధుమేహం సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
శ్రీనివాసాచార్యుల మృతిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారికంగా ప్రకటించింది. అర్చకుడి మృతిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అశోక్ సింఘాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్చకుడి మృతి దురదృష్టకరమని అన్నారు.
టీటీడీ నిబంధనల మేరకు మృతుని కుటుంబానికి సాయం అందిస్తామని ప్రకటించారు. తిరుమలలో ఇప్పటి వరకు పది మందికిపైగా అర్చకులు, సిబ్బంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం దిగువన ఉన్న టెంపుల్ టౌన్ తిరుపతిలో ఆగస్టు 14వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో తిరుపతిలో లాక్ డౌన్ పొడగించారు.
Recommended Video
అయితే తిరుమల వెళ్లే ఏడుకొండల స్వామి భక్తులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. గోవిందుడి దర్శనానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపులు ఉంటాయని అధికారులు తెలిపారు.