వయోధిక వృద్ధుల కోసం తిరుమలలో రేపు ప్రత్యేక దర్శనం: నాలుగు వేల టోకెన్లు.. !
తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, అయిదు సంవత్సరాల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో వారికి ప్రత్యేక దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడత దర్శనం మంగళవారం ఆరంభం కానుంది.
Tirumala: వైకుంఠ ఏకాదశికి ముమ్మర ఏర్పాట్లు: 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం
తొలిదశలో 65 సంవత్సరాలకు పైబడి వయస్సు ఉన్న వయోధిక వృద్ధులకు స్వామివారి దర్శనాన్ని కల్పించనుంది. దీనికోసం నాలుగువేల టోకెన్లను జారీ చేశారు టీటీడీ అధికారులు. ఉదయం 10 గంటల స్లాట్ సమయంలో వెయ్యి, మధ్యాహ్నం రెండు గంటలకు రెండువేల టోకెన్లను జారీ చేయనుంది. అలాగే- మూడు గంటల స్లాట్లో మరో వెయ్యి టోకెన్ల జారీ చేయనుంది.
ఇదే అవకాశాన్ని దివ్యాంగులకు కూడా కల్పించింది. వారికి ఈ నెల 28వ తేదీన ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేసింది. వయోధిక వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండటానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఎస్వీ మ్యూజియం సమీపంలో గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నామని తెలిపారు.
ఉదయం 7 గంటల సమయంలో టోకెన్ల జారీ ఆరంభమౌతుంది. ఒకేసారి రెండు స్లాట్లకు సంబంధించిన టోకెన్లను కేటాయిస్తారు. భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.