టీటీడీ గుడ్ న్యూస్: స్వామివారిని దర్శించుకునే సాధారణ భక్తులకు లడ్డూతో పాటు ఇది కూడా..!
Recommended Video
తిరుమల: ఇప్పటి వరకు ప్రసాదంగా రుచికరమైన లడ్డూనే ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం... ఇకపై ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రసాదంగా వడను కూడా ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కళ్యాణం టికెట్ తీసుకున్న వారికి మాత్రమే వడను ప్రసాదంగా ఇచ్చేవారు. ఇకపై సాధారణ భక్తులకు కూడా ప్రసాదం కింద వడను అందజేయనుంది టీటీడీ.
ఇదిలా ఉంటే భక్తులకు ఇవ్వాలని భావిస్తున్న వడ ధరలను టీటీడీ పెంచేసింది. ఒకప్పుడు వడ ధర రూ.20గా ఉండేది. ఇప్పుడు దాని ధరను ఐదురెట్లు పెంచి రూ.100 చేసింది. అంతేకాదు భక్తులకు ప్రత్యేక కౌంటర్లలో వడను అందజేయాలని భావిస్తోంది. గురువారం నుంచే వడను ప్రసాదంగా అందజేయడం ప్రారంభించింది. ఇక రానున్న రోజుల్లో అధికారికంగా వడను ప్రసాదంగా భక్తులకు అందేలా చూస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఫిబ్రవరి 1నుంచి లడ్డూను ఉచితంగా భక్తులకు టీటీడీ సరఫరా చేస్తోంది.
ప్రత్యేక టికెట్ ఉన్నవారికి మాత్రమే కళ్యాణం లడ్డూ ఇప్పటివరకు ఇస్తూ వస్తున్న టీటీడీ... ఇప్పుడు సాధారణ భక్తులకు కూడా ఈ లడ్డూను ఇవ్వడం ప్రారంభించింది. టీటీడీ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు కళ్యాణం లడ్డూ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సాధారణ భక్తులకు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఉచిత లడ్డూ ప్రసాదం పక్కనబెడితే.. కళ్యాణం లడ్డూలను ప్రత్యేక కౌంటర్లలో కూడా టీటీడీ విక్రయిస్తోంది. ఒక్కో కళ్యాణం లడ్డు ధర రూ.200. ఇలా రోజుకు 10వేల లడ్డూలను భక్తులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించాలని టీటీడీ భావిస్తోంది.ప్రస్తుతం
రోజుకు 5వేల నుంచి 6వేల వరకు కళ్యాణ లడ్డూలను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారీ సైజులో ఉండే కళ్యాణ లడ్డూలకు బాగా డిమాండ్ ఉంటుంది. భక్తులు ఈ లడ్డూలను కొనుగోలు చేసి రాజకీయనాయకులకు కానుక కింద ఇస్తారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లే మంత్రులు కానీ, ఎంపీలు కానీ కళ్యాణం లడ్డూలను అందజేస్తారు. ఉత్తరాది వారు ఈ కళ్యాణం లడ్డూ అంటే చాలా ఇష్టపడతారు.