బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం -నేడు శ్రీవారి గరుడ వాహన సేవ..!!
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్త జనం భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు భక్తులతో నిండిపోయాయి. నేటి రాత్రి 7 గంటలకు శ్రీవారి గరుడ వాహన సేవను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. గరుడ సేవకు 5 వేల మంది పోలీసులతో భద్రత నిర్వహించనున్నారు. మాడవీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. గరుడ సేవలో టీటీడీ హారతులను రద్దు చేసింది. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి వ్యక్తిగతంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు మూడు లక్షల మంది శ్రీవారి గరుడ వాహనసేవ వీక్షించేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
గ్యాలరీల్లో ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తారు. అన్నప్రసాద భవనంలో రాత్రి ఒంటి గంట వరకు అన్నప్రసాదాలు అందజేయనున్నారు. భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు అదనంగా ఏడు ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. జీఎన్సీ టోల్గేట్, సీఆర్వో, బాలాజీ బస్టాండ్, రాంభగీచా విశ్రాంతి గృహాలు, రాగిమాను సెంటర్, ఏటీసీ సర్కిల్, బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద హెల్ప్ డెస్క్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.
భక్తులకు కావాల్సిన సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి వెళ్లే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్గ నిర్దేశ బోర్డులు అందుబాటులో ఉంచారు.
భద్రత - బస్సు సర్వీసులు
రద్దీ ఎక్కువగా ఉండటంతో చిన్న పిల్లలకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ సమయంలో తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే గుర్తించేందుకు వీలుగా ముందస్తు చర్యల్లో భాగంగా..పిల్లలకు చైల్డ్ ట్యాగ్లు కడుతున్నారు. గరుడ సేవను తిలకించేందుకు నిమిషానికి రెండు ఆర్టీసీ సర్వీసులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది. ఎలక్ట్రిక్ బస్సులతో కలిపి తిరుమల ఘాట్ రోడ్లో 5044 ట్రిప్పులతో 2 లక్షల మంది భక్తుల రాకపోకల టార్గెట్గా ఆర్టీసీ సిద్ధమయింది. ఈ మేరకు తిరుపతిలో 13 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది.
పల్లకీపై మోహినీ అలంకారంలో
దసరా సెలవులు..శ్రీవారి బ్రహ్మోత్సవాలు కావటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో..సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించటం లేదు. సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇస్తోంది. అటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 24 కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి.