టీటీడీ కీలక నిర్ణయం: సర్వదర్శన టికెట్ల జారీ నిలిపివేత
తిరుపతి: కరోనా పాజిట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనాల సంఖ్యను టీటీడీ తగ్గించింది. ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ కలిపి 12 వేల టికెట్లు టీటీడీ జారీ చేస్తోంది.
ఆన్లైన్లో ప్రత్యేక ప్రదేశ దర్శనానికి 9 వేల టికెట్లు, నేరుగా వచ్చి కొనుగోలు చేసేందుకు వీలుగా ఆఫ్లైన్ ద్వారా 3వేల టికెట్లను ఇప్పటి వరకు టీటీడీ జారీ చేసింది. ప్రస్తుతం తిరుపతి నగరంలో లాక్డౌన్ అమలవుతుండటంతో ఆఫ్లైన్ విధానంలో తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది.
కాగా, చిత్తూరు జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో సుమారు 40 శాతానికిపైగా తిరుపతిలోనే ఉన్నాయి. దీంతో 48 డివిజన్లను కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి చేర్చారు. ఈ క్రమంలో సర్వదర్వనం టికెట్లు జారీ చేసే భూదేవి కాంప్లెక్స్ లాక్డౌన్ పరిధిలోకి రావడంతో టీటీడీ టికెట్ల జారీ నిలిపివేసింది.
టీటీడీ ఉద్యోగులు, అర్చకులు అధిక సంఖ్యలో కరోనావైరస్ బారిన పడుతుండటంతో దర్శనాల సంఖ్య తగ్గించడంతోపాటు దర్శనాల టీటీడీ సమీక్ష నిర్వహిస్తోంది. తిరుపతిలో కేసుల పెరుగుదల, టీటీడీ సిబ్బందికి కరోనా సోకడం లాంటి అంశాలతో రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నివేదిక సమర్పించింది. ప్రభుత్వ సూచనల మేరకు టీటీడీ దర్శనాలను కొనసాగిస్తోంది.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
భక్తుల కోరిక మేరకు ఆన్లైన్(వర్చువల్) ద్వారా ఇంటి నుండే వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని టీటీడీ జెఈవో పి బసంత్కుమార్ తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా నిర్వహించనున్నట్లు బసంత్కుమార్ తెలిపారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఆయన కార్యాలయంలో సోమవారం ఉదయం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది పవిత్రమైన శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని భక్తుల కోరిక మేరకు ఆన్లైన్(వర్చువల్)లో చేయాలని టిటిడి నిర్ణయించినట్లు తెలిపారు. గత ధర్మకర్తల మండలి సమావేశంలో వీలైనన్ని ఆర్జిత సేవలను ఆన్లైన్(వర్చువల్) ప్రక్రియ ద్వారా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం మేరకు వరలక్ష్మీ వ్రతాన్ని ఆన్లైన్(వర్చువల్)లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.