బాలల దినోత్సవం నాడు చిన్నపిల్లల కోసం భారీ ప్రాజెక్ట్: టీటీడీ: వైఎస్ జగన్ శంకుస్థాపన
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మరో భారీ ప్రాజెక్టునకు శ్రీకారం చుట్టబోతోంది. అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది నవంబర్ 14వ తేదీన దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతోంది. చిన్నపిల్లలకు మరింత మెరుగైన వైద్య చికిత్సను అందించడానికి ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తిరుపతిలో నిర్మించబోతోంది టీటీడీ. ఈ ఆసుపత్రి నిర్మాణానికి నవంబర్ 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిజేబిల్డ్ (బర్డ్) ఆసుపత్రి భవనాల్లో తాత్కలికంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నవంబర్ 14వ తేదీ నాడే ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన అనంతరం అందులోకి తరలించేలా ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. బర్ద్ ఆసుపత్రిలో నిర్వహించిన టీటీడీ మెడికల్ కమిటీ సమావేశంలో ఈ దిశగా చర్చించారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ భేటీ ఏర్పాటైంది.
తిరుపతిలో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పాల్సిన అవసరం ఉందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దీనికోసం సుదీర్ఘంగా చర్చించారు. బర్డ్ పాత బ్లాక్ భవనంలో ఆసుపత్రి ప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత రెండు నుంచి రెండున్నరేళ్లలో కొత్త భవనాల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో గుండె, బోన్ మారో సర్జరీలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో చిన్న పిల్లలకు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదనీ, ఆ లోటును భర్తీ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
దీనికోసం కంచి ట్రస్ట్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్య నిపుణుల సేవలు, సలహాలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల పిల్లలకు బోన్ మారో సర్జరీలు ఎక్కువగా అవసరం అవుతున్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తరువాత.. రెండో దశల కింద విశాఖపట్నంలో కూడా అదే తరహా ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం, వైద్య పరికరాలు, ఇతర వసతులకు సంబంధించి డీపీఆర్ రూపకల్పన బాధ్యతను వైద్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్కు అప్పగించారు.