శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్: ఇక వర్చువల్ ప్లాట్ఫామ్పై: ప్రయోగాల దిశగా టీటీడీ
తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సుదీర్ఘకాలం తరువాత సప్తగిరుల్లో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ముందు జాగ్రత్తలను తీసుకుంటూనే.. భక్తులకు జారీ చేయాల్సిన ఆన్లైన్ కోటా టికెట్లను క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల సంఖ్య ఇదివరకటి రోజుల కంటే పెరుగుతోంది.
Recommended Video
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం ఆన్లైన్ కోటాను పెంచారు టీటీడీ అధికారులు. ఫలితంగా- శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఓ మోస్తరుగా పెరిగింది. 27,107 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 10,517 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత సుమారు మూడునెలల పాటు భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించన లేదు అధికారులు.
రెండు నెలల కిందట సాలకట్ల బ్రహ్మోత్సవాలు, కిందటి నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ కోటాను నిలిపివేశారు. అనంతరం వాటిని పునరుద్ధరించారు. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలను కూడా ఇన్నాళ్లూ ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి భక్తులకు అనుమతి ఇవ్వలేదు.
భక్తుల నుంచి వస్తోన్న డిమాండ్కు అనుగుణంగా.. ఆర్జిత సేవలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో దీన్ని కొనసాగించనున్నారు.
స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్లైన్ వర్చువల్ ప్లాట్ఫామ్పై ఈ నెల రెండో వారం నుంచి భక్తులకు అందుబాటులో తీసుకుని రావడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల రెండో వారం నుంచి వర్చువల్ విధానంలో ఆర్జిత సేవలను ప్రసారం చేస్తారు. ఆలయంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆర్జిత సేవా టికెట్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించబోరు. దీని కోసం ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది వెల్లడించారు.