శ్రీవారి డిపాజిట్లు.. ఇక జాతీయ బ్యాంకుల్లోనే: తొలిదశలో రూ.1400 కోట్లు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకల రూపంలో అందే ఆదాయాన్ని ఇకపై జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ప్రైవేటు బ్యాంకుల్లో నగదు డిపాజిట్లకు భద్రత ఉండకపోవచ్చనే కారణంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. నిజానికి- ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ కొందరు శ్రీవారి భక్తులు ఇదివరకే న్యాయస్థానాల్లో పిటీషన్లను దాఖలు చేశారు. దీనికి కౌంటర్ ఇస్తూ.. తన తాజా నిర్ణయాన్ని ప్రకటించింది టీటీడీ.
కోట్ల రూపాయల ఆదాయం..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే రోజువారి ఆదాయం కోట్ల రూపాయల్లో ఉంటోంది. ఒక్క హుండీ ద్వాారా మాత్రమే రోజూ కనీసం 80 లక్షల రూపాయల ఆదాయం అందుతుంటుంది. బ్రహ్మోత్సవాలు, పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పెరుగుతుంటుంది. దీనితోపాటు లడ్డులు,, దర్శనం టికెట్ల విక్రయాలు, వసతి గదుల అద్దె, బ్యాంకుల్లో నిల్వ ఉంచిన బంగారం, ఇతర నగదుపై వచ్చే వడ్డీ.. ఇవన్నీ లెక్కేసుకుంటే ఏడుకొండలవాడికి వచ్చే ఆదాయం రోజూ కోట్ల రూపాయల్లోనే.
ప్రైవేటు బ్యాంకుల వైపు మొగ్గు..
ఇంత భారీ ఎత్తున వచ్చే నగదును ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకుడు పుట్టా మధుసూదన్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటైన పాలక మండలి.. ప్రైవేటు బ్యాంకుల్లో కూడా భద్ర పరచాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయనే ఒకే ఒక్క కారణాన్ని చూపింది. వందల కోట్ల రూపాయలను ప్రైవేటు బ్యాంకుల్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని తీర్మానించింది.
హైకోర్టులో పిటీషన్..
నాటి పాలక మండలి నిర్ణయాన్ని నిరసిస్తూ కొందరు భక్తులు అప్పట్లో హైకోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు. జాతీయ బ్యాంకులు ఉండగా.. టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం పట్ల తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన పాలక మండలికి నోటీసులను జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
వెనక్కి తీసుకుంటామంటూ..
దీనిపై స్పందించిన టీటీడీ పాలక మండలి.. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రైవేటు బ్యాంకులకు బదులుగా జాతీయ బ్యాంకుల్లోనే శ్రీవారి ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్ర పరుస్తామని వెల్లడించింది. తొలిదశలో 1400 కోట్ల రూపాయల మొత్తాన్ని జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తామని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ప్రైవేటు బ్యాంకుల వైపు మొగ్గు చూపబోమని టీటీడీ పాలక మండలి ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించింది.
నిధుల దుబారా అయ్యాయంటూ..
ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కాకినాడలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష కోసం టీటీడీ నుంచి ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను మళ్లించినట్లు విజిలెన్స్ కమిషన్ అధికారులు నిర్వహించిన దర్యాప్తులో స్పష్టమైంది. ప్రైవేటు బ్యాంకుల్లో శ్రీవారి కానుకలను డిపాజిట్ చేయడం వల్ల ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు వాటిని మళ్లించడానికి సులువు అవుతుందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. టీటీడీ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.