దళారులకు చిక్కి మోసపోవద్దు.. టీటీడీలో ఉద్యోగాలపై విజిలెన్స్ అలర్ట్...
టీటీడీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన కిరణ్ నాయుడుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆశజూపి రూ.20వేలు గుంజే ప్రయత్నం చేశాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిరణ్ నాయుడు గతంలోనూ పలువురిని ఇలాగే మోసం చేసినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారులను నమ్మి మోసపోవద్ధని టీటీడి విజిలెన్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు. టీటీడీలో ఉద్యోగాల భర్తీకి పత్రికల్లో,వెబ్సైట్లో అధికారిక ప్రకటన ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గతంలోనూ కొంతమంది టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,దళారుల చేతిలో మోసపోవద్దని అన్నారు.
Recommended Video
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి ఆలయాలు నిర్మించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం(అగస్టు 26) జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే జమ్మూ ప్రభుత్వానికి ఆలయ నిర్మాణంపై సమగ్ర నివేదికను టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు అందివ్వనున్నట్లు ఆయన తెలిపారు.టీటీడీ అధికారుల నివేదికను పరిశీలించిన అనంతరం జమ్మూ ప్రభుత్వం అనుమతితో ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.