పోర్న్ సైట్లు చూసుకుంటున్న ఎస్వీసీబీ ఉద్యోగులు- పని మానేసి- విజిలెన్స్ తనిఖీల్లో గుర్తింపు
నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే తిరుమల తిరుపతి దేవస్దానంలో మరో అపవిత్ర కార్యం చోటు చేసుకుంది. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్కు గతంలో ఛైర్మన్గా పనిచేసిన సినీనటుడు బాలిరెడ్డి పృధ్వీరాజ్ లైంగిక వేధింపుల ఆరోపణలతో పదవి కోల్పోగా.. ఆ తర్వాత కొత్త ఛైర్మన్ వచ్చినప్పటికీ ఉద్యోగుల తీరు మాత్రం మారలేదు. తాజాగా విధి నిర్వహణ సమయంలో పోర్న్ వీడియోలు చూస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 25 మంది ఉద్యోగులు పట్టుబడటం సంచలనం రేపుతోంది. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్వీబీసీలో పోర్న్ వీడియోల కలకలం..
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసీ భక్తి ఛానల్కు చెందిన కొందరు ఉద్యోగులు తమ డ్యూటీ సమయంలో ఆఫీసులోనే పోర్న్ వీడియోలు చూస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీరియస్ అయ్యారు. విజిలెన్స్ అధికారులను విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే విషయాలు తెలిశాయి. అసలు ఈ తంతు ఎలా బయటపడిందనే విషయం కూడా ఆసక్తికరంగా మారడంతో ఎస్వీబీసీతో పాటు టీటీడీ కూడా మరోసారి విమర్శలకు కేంద్రబిందువుగా నిలిచాయి.
పోర్న్ వ్యవహారం బయటపడిందిలా...
ఎస్వీబీసీకి చెందిన శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఛానల్కు ఓ భక్తుడు మెయిల్ చేశారు. తిరిగి భక్తుడికి పోర్న్ వీడియో సైట్ లింక్ రిఫ్లై మెయిల్లో వెళ్లింది. దీనిపై సదరు భక్తుడు టీటీడీ ఛైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఛైర్మన్ సుబ్బారెడ్డి ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. వెంటనే దీనికి కారణాలు తెలుసుకోవాలని విజిలెన్స్ను ఆదేశించారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు పోర్న్ వీడియో భక్తుడికి వెళ్లడానికి గల కారణాలు ఆరా తీశారు. సాంకేతిక సిబ్బంది సాయంతో పోర్న్ సైట్లు ఎందుకు ఓపెన్ అయ్యాయనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో తీగ లాగితే డొంక కదిలినట్లు అసలు వ్యవహారం బయటపడింది.
Recommended Video
పోర్న్ వీడియోలు చూస్తున్న ఉద్యోగులు...
ఎస్వీబీసీ కార్యాలయం నుంచి శ్రీవారి భక్తుడికి పోర్న్ వీడియో సైట్ లింక్ ఎలా వెళ్లిందన్న దానిపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారంలో లింక్ మెయిల్ పంపిన ఉద్యోగితో పాటు పోర్న్ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు. వీరి సాయంతో విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్ టీమ్ గుర్తించింది. దీంతో ఇప్పుడు వీరందరిపై చర్యలకు ఎస్వీబీసీ సిద్ధమవుతోంది. ఈ వ్యవహారం ఎంతకాలంగా సాగుతోందన్న అంశాన్ని కూడా సైబర్ క్రైమ్ టీమ్ పరిశీలిస్తోంది. విధులు మాని వీడియోలు చూస్తున్న ఉద్యోగులపై త్వరలోనే శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.