ఏడుకొండలపై ఏసుమందిరాలు: దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల గిరుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అణువణువునా హిందుత్వం.. అనే వాట్సప్ గ్రూప్ సభ్యుడిగా ఉన్న అరుణ్ కాటేవల్లిగా గుర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో అరుణ్ కాటేవల్లి అనే వ్యక్తి కోసం తిరుమల పోలీసులు గాలిస్తున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ అభిమానులను తరిమి కొట్టి.. బర్త్ డే కేక్ ను కాలితో తొక్కి: క్షమాపణ చెప్పిన డైరెక్టర్
ఏడుకొండలపై ఏసుమందిరాలు అనే పేరుతో కొద్దిరోజుల కిందట వాట్సాప్ గ్రూపుల ద్వారా కొన్ని ఫొటోలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారాయి. నిజానికి అది చర్చి నిర్మాణం కాదు. అటవీ విభానికి సంబంధించిన చెక్ పోస్ట్, వాచ్ టవర్. తిరుపతి శివార్లలోని కరకంబాడి సమీపంలో శేషాచలం అడవుల్లో అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్, దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా ఫోటో తీసి, దానిపై దుష్ప్రచారం చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
అతనిపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేపట్టిన అరుణ్ కాటేవల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతని కోసం గాలిస్తున్నారు. అణువణువునా హిందుత్వం గ్రూప్ అడ్మిన్ ను కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.