జగన్కు భారీ ఊరట నిచ్చిన బాబాయ్- డిక్లరేషన్కు మంగళం- టీడీపీ, బీజేపీ విమర్శలకు చెక్..
ఏపీలో అంతర్వేది ఘటన తర్వాత దేవాలయాల్లో భద్రతపై చర్చ మొదలైంది. దీనిపై విపక్షాల రగడతో ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన రెండు రోజుల్లోనే విజయవాడ కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాలు మాయం అయ్యాయి. ఈ వ్యవహారం దర్యాప్తు సాగుతుండగానే టీటీడీ ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే తిరుమలలో అన్యమతస్తుల ప్రస్తావన వస్తే చాలు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో విపక్షాలకు చెక్ పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం వారికి అస్త్రంగా మారే అవకాశాలూ లేకపోలేదు. ముఖ్యంగా సీఎం జగన్కు ఊరటనిచ్చేందుకు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఆరోగ్యశ్రీపై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం... ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు...
టీటీడీలో డిక్లరేషన్ నిబంధన...
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగిన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు హిందువులతో పాటు అన్యమతస్తులకు కూడా అవకాశం ఉంది. కానీ అన్యమతస్తులు శ్రీవారిపై తమకు విశ్వాసం ఉందంటూ ఓ డిక్లరేషన్ ఇచ్చాకే దర్శనానికి అనుమతిస్తున్నారు. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వంటి వారు ఈ విధంగా డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల దర్శనాలు చేసుకునే వారు. వీరితో పాటు చాలా మంది అన్యమతస్తులకు కూడా టీటీడీలో డిక్లరేషన్ అమలు చేస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే వైసీపీ అధినేత జగన్ ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండానే దర్శనాలు చేసుకుంటున్నారు. దీనిపై విపక్షాలతో పాటు హైందవ భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.
డిక్లరేషన్ నిబంధన ఎత్తేసిన టీటీడీ...
నిన్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దర్శనాలకు డిక్లరేషన్ అవసరం లేదని తేల్చేశారు. ఎలాంటి డిక్లరేషన్ లేకుండానే అన్యమతస్తులు శ్రీవారి దర్శనాలు చేసుకోవచ్చని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పటికే తిరుమలలో అన్యమతస్తుల ప్రచారాలు, డిక్లరేషన్ లేకుండానే లాబీయింగ్ దర్శనాలు చేసుకుంటున్న తరుణంలో ఛైర్మన్ సుబ్బారెడ్డి ఇప్పుడు ఏకంగా డిక్లరేషన్ అవసరం లేదని బహిరంగంగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. సీఎం జగన్ కోసమే బాబాయ్ ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక ఇప్పటికే అమలు చేస్తున్న విషయంలో క్లారిటీ ఇచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీటీడీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పటి నుంచి అన్యమతస్తులు కూడా ఎలాంటి డిక్లరేషన్ లేకుండా దర్శనాలు చేసుకునేందుకు వీలు కలిగింది.
డిక్లరేషన్ ఎప్పుడూ వివాదమే...
తిరుమలకు వచ్చే అన్యమతస్తులు దర్శనాలు చేసుకునేందుకు డిక్లరేషన్ నిబంధన కొన్ని దశాబ్దాల క్రితమే పెట్టినప్పటికీ సక్రమంగా అమలు కాలేదు. మధ్యలో భక్తుల ఆందోళన కారణంగా కొన్నిసార్లు, రాజకీయ విమర్శల కారణంగా మరికొన్నిసార్లు, ప్రభుత్వాల ఒత్తిళ్ల నడుమ మరికొన్నిసార్లు ఈ నిబంధన అమలవుతూ వచ్చింది. డిక్లరేషన్ విషయంలో కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి. టీటీడీ నిబంధనల ప్రకారం అసలు డిక్లరేషన్ అనేదే లేదని గతంలో వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే సంప్రదాయం ప్రకారమే డిక్లరేషన్ నిబంధన అమలు జరుగుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అబ్దుల్ కలాం, సోనియాగాంధీ వంటి వీవీఐపీలే డిక్లరేషన్ ఇచ్చి దర్శనాలు చేసుకోగా.. ఇప్పుడు సీఎం జగన్ కోసం టీడీడీ నిబంధన మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
. జగన్ కోసం బాబాయ్ సాహసం...
ఈ నెల 23న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి డిక్లరేషన్ నిబంధన అడ్డు పడుతుంది. డిక్లరేషన్ ఇవ్వకుండానే జగన్ శ్రీవారి దర్శనం చేసుకుంటే విమర్శలు తప్పవు. ఇప్పటికే డిక్లరేషన్ ఇవ్వకుండానే జగన్ దర్శనాలు చేసుకుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో విమర్శలకు చెక్ పెట్టేందుకా అన్నట్లు వైవీ సుబ్బారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే డిక్లరేషన్ విషయంలో పలు వివాదాలు చోటుచేసుకోవడం, రాష్ట్రంలో తాజాగా గుళ్లలో జరుగుతున్న ఘటనల దృష్ట్యా ఈ వ్యవహారం కూడా వివాదాస్పదమయ్యేలా కనిపిస్తోంది.