పాక్ చైనా బోర్డర్ లో ఉద్రిక్తత తగ్గాలని.. తిరుమల శ్రీవారిని కోరుకున్న కేంద్రమంత్రి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దీపావళి రోజున స్వామి వారిని దర్శించుకోవడం, స్వామి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉందని పేర్కొన్న ఆయన ఈ సమస్యలను అధిగమించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు.
రానున్న రోజుల్లో ప్రపంచంలో మన దేశం బలీయమైన శక్తిగా ఎదుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని కోరుకున్నట్టు పేర్కొన్న మంత్రి కిషన్ రెడ్డి, దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి పండుగ దేశ ప్రజల్లో వెలుగులు నింపాలని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రోటోకాల్ ప్రకారం స్వామివారి దర్శనం చేయించారు.
సాదర స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించి హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని గౌరవించారు. ఇదే సమయంలో శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో, మన దేశానికి కరోనా మహమ్మారి నుండి విముక్తి లభించాలని ఆయన స్వామి వారిని కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆయన ఈరోజు ప్రత్యేక తిరు ఆభరణాలతో అలంకరించి స్వామి వారికి ప్రత్యేక నివేదనలు సమర్పించామని పేర్కొన్నారు.