శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్: వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ టికెట్లు: బుకింగ్ ఇలా: పరిమితంగా
తిరుపతి: ఈ నెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరిమితంగా మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. ఆన్లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నారు. దీనికి అవసరమైన ఆన్లైన్ల టికెట్ల కోటాను టీటీడీ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున 6:30 గంటలకు విడుదల చేశారు.
చంద్రుడిపైకి ఆస్ట్రో రాజా: హైదరాబాద్తో లింక్: తండ్రి ఉస్మానియా పూర్వ విద్యార్థి: నాసా లిస్ట్
పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం..
ఈ 25 నుంచి పదిరోజుల పాటు అంటే.. జనవరి 3వ తేదీ వరకు ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేశారు. రోజుకు 20 వేల టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచారు. 25వ తేదీన వైకుంఠ ఏకాదశి, 26న ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. తిరుమాడా వీధుల్లో భక్తుల సౌకర్యం కోసం వసతిని కల్పించనున్నారు. ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి భక్తులను పరిమితంగా అనుమతి ఇచ్చే అవకాశాలను టీటీడీ అధికారులు పరిశీలిస్తున్నారు. భక్తులు చలికి ఇబ్బందులు పడకుండా అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు.
20 వేల మందికి అవకాశం..
వైకుంఠ ఏకాదశి సందర్భ:గా శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ఏకాదశి నాటి నుంచి 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ టికెట్ల బుకింగ్ను శుక్రవారం తెల్లవారు జామున ప్రారంభించారు. ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లేదా గోవిందా యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
వారికి దర్శనభాగ్యం లేనట్టే..
కోవిడ్ ప్రొటోకాల్కు అనుగుణంగా రోజుకు 20 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనాన్ని కల్పిస్తారు. అలాగే- వృద్ధులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించే అవకాశాలు దాదాపుగా లేనట్టే. పదేళ్ల లోపు పిల్లలు, 65 సంవత్సరాలకు పైన వయస్సున్న వృద్ధులు స్వామివారిని దర్శించడానికి టీటీడీ అనుమతించట్లేదు. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల రావొద్దని టీటీడీ అధికారులు విజ్ఙప్తి చేస్తున్నారు. కరోనా వైరస్ లక్షణాలను గుర్తించడానికి గెస్ట్హౌస్లల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు కనిపించిన వారికి దర్శనానికి అనుమతి ఇవ్వరు. ప్రతి ఒక్కరూ కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
తిరుమలకు ప్రత్యేక బస్సులు..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు ప్రత్యేక బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే.. ఈ సారి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ.. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రవాణా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నార. బస్సుల్లో భౌతిక దూరాన్నిపాటించాల్సి ఉన్నందున.. అదనపు సర్వీసులను అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు.