టీటీడీ కీలక నిర్ణయం: రూ. 10వేలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం
తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి వీఐపీ దర్శనం కోసం శ్రీవారి భక్తులు రూ. 10వేలను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం(శ్రీవాణి ట్రస్ట్) పేరుతో ఈ పథకాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీవాణి పథకానికి రూ. 10వేలు విరాళంగా ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ దర్శనం అందిస్తామని తెలిపారు.
గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. నవంబర్ తొలి వారంలో శ్రీవాణి ట్రస్ట్ పథకానికి సంబంధించిన యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మొదటి 15 రోజులపాటు తిరుమలలో కరెంటు బుకింగ్ విధానంలో టిక్కెట్లను అందించనున్నట్లు చెప్పారు.
ఈ ట్రస్ట్కు వచ్చిన విరాళాలతో ఆలయాల పరిరక్షణ, నిర్మాణాలకు వినియోగిస్తామని చెప్పారు. విరాళాలు ఇచ్చిన భక్తుడికి ప్రోటోకాల్ పరిధిలో పరిగణిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తామని వివరించారు. విరాళంగా ఇచ్చే రూ. 10వేలతోపాటు టికెట్ను రూ. 500తో కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి.
ఒక నెల ముందుగానే కోటాను విడుదల చేస్తామని టీటీడీ ఈవో తెలిపారు. ఈ సేవకు వచ్చే నిధులను రాష్ట్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి వెచ్చించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండే ప్రాంతాల్లో ఆలయాలను నిర్మిస్తామని, ఇలా చేయడం ద్వారా మతమార్పిడులకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
కాగా, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా, అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇక, ఈ విధానంలో గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఇచ్చినట్లుగా ముందుగా జేఈవో ఆఫీసులో అప్లికేషన్ ఇవ్వాల్సిన పనిలేదు. రాత్రి 11 గంటల వరకు భక్తులు ఎప్పుడైనా వచ్చి.. గోకులం గెస్ట్ హౌస్లోని కౌంటర్లో విరాళాన్ని ఇచ్చి టికెట్లు తీసుకోవచ్చు. రూ. 500 టికెట్ కూడా కొనుగోలు చేసి మరుసటి రోజు ఉదయం ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం సమయంలో.. భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ముందుగా ప్రోటోకాల్ పరిధిలోని వారిని దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత శ్రీవాణి ట్రస్టుకు విరాళామిచ్చిన దాతలను అనుమతిస్తారు.