టీటీడీకి భారీ విరాళాన్ని అందజేసిన విశాఖ వ్యాపారి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధర్యంలో నడుస్తోన్న శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్ట్ కు భారీ విరాళం అందింది. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారి యార్లగడ్డ సూర్యారావు స్వామివారికి 1.01 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు.
రాజమండ్రి జైలుకు నకిలీ రైతు శేఖర్ చౌదరి: మొన్న..నిన్న..చివరికి నేడు ఇలా!
ఈ మొత్తంతో కూడిన చెక్కును ఆయన గురువారం ఉదయం టీటీడీ ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తోన్న దేవీ ఫిషరీష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ సూర్యారావు తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం తిరుమల ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాయకుల మండపం వద్ద కోటి 10 వేల రూపాయల మొత్తంతో కూడిన చెక్కును ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్ట్ కు వినియోగిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. అనంతరం- అర్చకులు సూర్యారావుకు స్వామివారి శాలువ, తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులు శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్ట్ కు కోటి రూపాయలకు పైగా విరాళాన్ని అందజేయడం నెలరోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఇదివరకు అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుడొకరు స్వామివారికి కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.