తిరుపతి ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి- వైసీపీ, టీడీపీ పాత వైఖరికే కట్టుబడతాయా ?
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో, అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కొన్నిసార్లు సిట్టింగ్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ తమ పదవీకాలంలో అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులను నిలబెట్టడం, విపక్షాలు వారికి మద్దతు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. జరుగుతోంది. కానీ కొన్నిసార్లు మాత్రం దీనికి విరుద్ధంగా విపక్షాల అభ్యర్దులు రంగంలోకి దిగడం, గెలుపోటములు చవిచూడటం కూడా జరిగిపోయాయి. గతాన్ని వదిలిపెడితే ఇప్పుడు మరోసారి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్ధితి తలెత్తింది. ఇందులో పార్టీల వైఖరులు ఎలా ఉండబోతున్నాయి ? గతంలో తీసుకున్న వైఖరికే పార్టీలు కట్టుబడతాయా లేక సంప్రదాయాన్ని వదిలిపెట్టి పోటీకి సిద్ధమవుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.
రాజ్యసభలో సాయిరెడ్డి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ- టీడీపీ ఫిర్యాదుతో రికార్డుల్లో తొలగింపు..
తిరుపతి ఉప ఎన్నిక..
తిరుపతిలో సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రెండు రోజుల క్రితం కరోనాతో బాధపడుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్ మృతికి సంతాపంగా వైసీపీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తిరుపతి ఎంపీ స్ధానంలో ఆరునెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఎంపీ మృతిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీకి సమాచారం పంపబోతోంది. దీని ఆధారంగా ఆరునెలల్లో ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. అనంతరం షెడ్యూల్ ఆధారంగా నోటిపికేషన్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం కరోనా కారణంగా ఉప ఎన్నిక నిర్వహణ ఎలా జరుగుతుందనే ఉత్కంఠ కూడా నెలకొంది.
ప్రత్యామ్నాయంపై వైసీపీ దృష్టి...
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతికి సంతాపంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన స్ధానంలో తిరుపతి ఉప ఎన్నికలో నిలబెట్టాల్సిన అభ్యర్దిపై దృష్టిసారిస్తున్నారు. గత సంప్రదాయాలను గౌరవిస్తూ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు సీటు కేటాయించాలా లేక వేరే అభ్యర్ధిని నిలబెట్టాలా అన్న అంశంపై వైసీపీలో చర్చ సాగుతోంది. ఒకవేళ దుర్గాప్రసాద్ కుటుంబం తరఫున పోటీకి ఎవరూ సిద్ధంగా లేకపోతే తమకు అవకాశం కల్పించాలని పార్టీలో కొందరు నేతలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో తిరుపతి ఎంపీ బరిలో ఎవరుంటారనే దానిపై ఆసక్తి పెరుగుతోంది.
ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు..
గతంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు వారి స్ధానంలో కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వైసీపీ సహకరించింది. ఒక్క భూమా నాగిరెడ్డి విషయంలోనే ఆయన కుటుంబం నుంచి నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిలబెట్టిన భూమా బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా శిల్పా మోహన్రెడ్డిని రంగంలోకి దింపింది. చివరికి నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి టీడీపీ సర్కారు మంచి మెజారిటీతో బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకుంది. ఆ తర్వాత మావోయిస్టుల చేతుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చనిపోవడంతో ఆయన కుమారుడిని మంత్రిని చేసినా ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం రాలేదు. దీంతో ఇప్పుడు గతంలో తాము పలువురు ఎమ్మెల్యేల మరణం సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఈసారి కూడా దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చి ఏకగ్రీవం చేయాలని చూస్తోంది.
Recommended Video
విపక్షాలు సహకరిస్తాయా ?
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎంపీ అయినా ఆయన గతంలో టీడీపీలో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆ పార్టీలో నేతలతో దుర్గాప్రసాద్కు, ఆయన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ కారణంతో దుర్గప్రసాద్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే టీడీపీ ఏకగ్రీవానికి సహకరిస్తుందా లేదా చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం బట్టి చూస్తే వైసీపీ ప్రయత్నాలకు టీడీపీ మద్దతివ్వకపోవచ్చు. కానీ మానవతాదృక్పథంతో సహకరించినా ఆశ్చర్యం లేదు. మరోవైపు బీజేపీ-జనసేన కూటమి నుంచి పోటీ ఉంటుందా లేక ఏకగ్రీవానికి సహకారం ఉంటుందో కూడా ఇప్పుడే తేలేలా లేదు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ తరహాలోనే యుద్దం చేస్తున్న బీజేపీ-జనసేన ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తాయా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.