రేణిగుంట సమీపంలో రైలు పట్టాలపై పేలుడు- మహిళకు తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ ఓ పేలుడు సంభవించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పేలుడులో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం రైలు పట్టాలపై ఉన్న టిఫిన్ బాక్సును మహిళ కదిలించగానే ఈ పేలుడు జరిగింది.
రేణిగుంట సమీపంలోని తారకరామనగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్పై ఇవాళ అటువైపుగా వెళ్తున్న పశువులు కాసుకునే ఓ మహిళ టిఫిన్ బాక్సును గమనించింది. దీంతో దగ్గరికి వెళ్లి ఆ టిపిన్ బాక్సును తెరిచే ప్రయత్నం చేయగా అది పేలిపోయింది. దీంతో సదరు మహిళకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న స్ధానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్లో ఆమెను పోలీసులు ఆస్ప్తత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిత్యం రైళ్ల రాకపోకలు సాగించే రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్పై జరిగిన పేలుడు స్ధానికంగా కలకలం రేపింది. రైలు పట్టాలపై టిఫిన్ బాక్సు ఎలా వచ్చింది, అందులో పేలుడు పదార్ధాలను ఎవరు ఉంచారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్పై రైలు వెళ్తున్న సమయంలో పేలుడు జరిగితే భారీ ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీంతో ఇది స్ధానికంగా ఎవరిపనైనా అయి ఉంటుందా లేక ఇతర రాష్ట్రాల వారు కావాలనే టిఫిన్ బాక్సును అక్కడికి తెచ్చి పెట్టారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.