జనం మధ్య జగన్: నాన్నగారిచ్చిన అతి పెద్ద కుటుంబం అంటూ భావోద్వేగం:
తిరుపతి: తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..జనంతో కలిసిపోయారు. వేదిక దిగి వచ్చి ప్రజలను కలిశారు. వారితో ఆప్యాయంగా చేతులు కలిపారు. అక్కడే అమర్చిన ఒక టేబుల్ పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. తనతో కరచాలనం చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్న వారిని ఆయన నిరుత్సాహ పరచలేదు. మైక్ అందుకుని తనదైన శైలిలో అభివాదం చేశారు.
తనను కరచాలం చేయడానికి ముందుకు బ్యారికేడ్లను దాటుకుని ముందుకు తోసుకు వస్తున్న అభిమానులు అనునయించారు. తోపులాట వద్దని వారించారు. తానే స్వయంగా వారి వద్దకు వెళ్లారు. పలువురు అభిమానులు తమ సెల్ కెమెరాల్లో జగన్ ను బంధించారు. వెనక ఉన్న వారికి కనిపించట్లేదని, ముందున్న వారు దయచేసి కూర్చోవాలని సూచించారు. ఆ సమయంలో జగన్ వెంట మాజీ లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డి ఉన్నారు.
సుమారు 15 నిమిషాల పాటు జగన్.. జనం మధ్య, అభిమానుల మధ్య గడిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని ఉద్వేగంగా చెప్పారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తన కుటుంబ సభ్యులని అన్నారు. పార్టీ కార్యకర్తలు రావాలి జగన్, కావాలి జగన్ అనే బ్యానర్లను ప్రదర్శించారు. తమపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తోందని ఈ సందర్భంగా కొందరు పార్టీ కార్యకర్తలు జగన్ దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీస్తే..
కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనికి జగన్ బదులిస్తూ- ఆ విషయం తన దృష్టికి ఇదివరకే వచ్చిందని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. బేషరతుగా కేసులను ఎత్తేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండ చూసుకుని అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారని అన్నారు. వారి ఆగడాలను అడ్డుకుంటే కేసులు పెట్టడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. అభిమానులు గుండెధైర్యం తనకు నచ్చిందని ప్రశంసించారు. తన పాదయాత్ర విజయవంతం కావడానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులే కారణమని అన్నారు.