తన నియోజకవర్గంలో రీపోలింగ్పై స్పందించిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి
తిరుపతి: రాష్ట్రంలో కిందటి నెల 11వ తేదీన ముగిసిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారని, తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా దళితులను అడ్డుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దీని ఫలితంగా- చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు. అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చినప్పటికీ- చిత్తూరు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ ఏమీ పట్టనట్టు వ్యవహరించారని అన్నారు. రీపోలింగ్ను నిర్వహించడానికి తలెత్తిన పరిస్థితులకు జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
గుజరాత్ తరహా విధ్వేషాగ్నికి కుట్ర..ఎన్నికల సంఘంలో బీజేపీ మనుషులు: చంద్రబాబు ఫైర్
చిత్తూరు జిల్లా కలెక్టర్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. దళితులు, గిరిజనులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కలెక్టర్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరని అనుమానం వచ్చిన వారందరినీ ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని, పోలింగ్ కేంద్రానికి కూడా వెళ్లనీయలేదని చెప్పారు. మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన దళితులను ఓటు వేయనివ్వలేదని ఆరోపించారు. ఏడు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ తాము కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు.
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒకే వ్యక్తి వేర్వేరు చోట్ల ఓటు వేస్తున్న విజువల్స్ సీసీటీవీ పుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నాయని, వాటిని సాక్ష్యంగా అందజేసినప్పటికీ- కలెక్టర్ పట్టించుకోలేదని చెవిరెడ్డి విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్కు ఆదేశించిన అయిదు కేంద్రాల్లో దళితుల్ని ఓటు వేయనివ్వడం లేదని అధికారులు కలెక్టర్కు నివేదిక ఇచ్చామని చెప్పారు. దళితులకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలోనే ఫిర్యాదు చేశామని చెప్పారు. అయినా చిత్తూరు జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదని ఆరోపించారు.
కాగా- చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్ ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురంలో రీపోలింగ్కు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన చివరి విడత పోలింగ్ సందర్భంగా ఈ అయిదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ను నిర్వహించబోతున్నారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సాగేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు జిల్లా పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది.