గాజువాకలో పవన్ కల్యాణ్ ఓటమి..అందుకే వైజాగ్పై పగ: 23 నుంచి సున్నాకు టీడీపీ: రోజా
తిరుమల: రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం తిరుమలకు చేరుకున్న ఆమె స్వామివారిని దర్శించారు. అనంతరం ఆలయ వెలుపల తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని, కొత్తగా ఇ- రక్షాబంధన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.
Recommended Video
ఇ-రక్షాబంధన్ ఉపయోగం..
సైబర్ క్రైమ్ వల్ల సంభవించే అనర్థాలపై దృష్టి పెట్టిందని చెప్పారు. సోషల్ మీడియా అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించడానికి ఇ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. సైబర్ నేరాల వల్ల కలిగే అనర్థాలు, ప్రమాదాలపై వివరించడానికి, మహిళల్లో అవగాహన కల్పించడానికి, నెలరోజుల పాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. రాఖీ పండుగ నాడే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని రోజా వ్యాఖ్యానించారు.
దిశ చట్టం వల్ల
ఇప్పటికే వైఎస్ జగన్ మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. దిశ చట్టాన్ని, మహిళా పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి అందుబాటులోకి తీసుకుని వచ్చారని, దీన్ని బట్టి చూస్తే మహిళలపై ఆయనకు ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇలా ఆలోచన చేయలేదని చెప్పారు. నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. మరో 30, 40 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నానని రోజా చెప్పారు.
గాజువాక ఓటర్లపై పవన్ కల్యాణ్కు పగ..
మూడు రాజధానులపై రోజా మాట్లాడుతూ.. దీనివల్ల రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం తెలుగుదేశం పార్టీకి గానీ, జనసేన పార్టీకి గానీ ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయిందని, అలాంటి పరిస్థితి రాకుండా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి టీడీపీ, జనసేన పార్టీలకు ఉన్న అభ్యంతరమేంటని అన్నారు. గాజువాక ఓటర్లు తనను ఓడించడం వల్లే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు, బినామీలకే నష్టం..
తెలుగుదేశం పార్టీకి వంత పాడేలా జనసేన పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటును అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని, ఒక్క తెలుగుదేశం, జనసేనలకు మాత్రమే ఇబ్బందిగా ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. తాను దోచుకున్న డబ్బుతో అమరావతిలో కొనుగోళ్లు చేసిన భూముల విలువ పడిపోయిందని చంద్రబాబుకు బాధగా ఉందని అన్నారు.
23 నుంచి సున్నాకు పడి
తెలుగుదేశం పార్టీ నేతలు తమ దిగజారుడు రాజకీయాలు మానుకోక పోతే వచ్చే ఎన్నికల్లో మరిన్ని చేదు ఫలితాలను చవి చూస్తారని రోజా హెచ్చరించారు. ఇప్పుడున్న 23 ఎమ్మెల్యేల సంఖ్య సున్నాకి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అమరావతి సెంటిమెంట్ నిజంగా ఉందని చంద్రబాబు నమ్మితే తనతో పాటు 23 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ప్రజా తీర్పును కోరాలని అన్నారు. ఎన్నికలకు వెళ్లే సత్తా చంద్రబాబుకు లేదని తేల్చి చెప్పారు.