పొత్తు లేదు..ఒంటరి పోరే: అవ్వా, తాతలకు రూ.3 వేల పింఛన్ ఇస్తాం: జగన్మోహన్ రెడ్డి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోలేదని, ఈ సారి కూడా అదే ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి మద్దతు ఇస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రజలను నిలువునా మోసగించాయని ఆరోపించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సాక్షిగా తిరుపతిలో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించిన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైెఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలపై వరాల జల్లును కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే- అవ్వా, తాతలకు ప్రతినెలా మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, దాన్ని ప్రజల ప్రభుత్వంగా మార్చుతానని అన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ఆదర్శవంతమైన పాలన అందిస్తానని చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగి, వేసారిపోయి ఉన్నారని అన్నారు. తమ ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశాన్ని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తిరుపతి సమీపంలోని యోగానంద కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. అమలు చేసే వాగ్దానాలను మాత్రమే తాను ఇస్తానని చెప్పారు. తాను గెలిస్తే రాష్ట్ర ప్రజలు గెలిచినట్టేనని అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకుని రావడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. ప్రత్యేక హోదా 5 కాదు, 10 కాదు.. 15 సంవత్సరాలు ఇస్తామని ఇదే తిరుపతిలో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా చేసిన హోదా హామీని చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, కేసుల నుంచి తప్పించుకోవడానికి హోదా డిమాండ్ ను కేంద్రం పాదాల వద్ద తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.
తమ పార్టీ ప్రభంజనం వీస్తోందని గుర్తించిన చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. సర్వేల పేరుతో ఇంటింటికీ వెళ్లి, తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేలా ఏర్పాట్లు చేశారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని తాను ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ కు వివరించానని అన్నారు. ఓట్ల తొలగింపులో ఎల్లో మీడియా కూడా చంద్రబాబుకు సాయం చేస్తోందని అన్నారు.
తాము ఎదుర్కోవాల్సింది చంద్రబాబు ఒక్కడినే కాదని, ఎల్లో మీడియా, ధనబలం, అధికారబలం, అన్యాయాలను ఎదుర్కొనడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు జగన్ కు వివరించగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆయా కేసులన్నింటినీ ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పడం, మడమ తిప్పడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్ల పేరుతో ఆ వర్గ ప్రజలను మోసగించారని మండిపడ్డారు. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకొంటోన్న ఆ పెద్ద మనిషి..
తాను ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతున్నారని అన్నారు. వృద్ధ్యాప్య పింఛన్, ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు వంటి పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని ఉదహరించారు. తొమ్మిదేళ్లు తన కోసం కష్టపడ్డారని, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు తగిలిన ప్రతి గాయమూ తనను బాధించిందని అన్నారు. వారి గుండెకు తగిలిన గాయం తన గుండెకు తగిలినట్టేనని అన్నారు. తనను అండగా ఉన్న వారిని ఆదుకునే బాధ్యతను తీసుకుంటానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ తన కుటుంబ సభ్యులేనని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే విషయం పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిందని అన్నారు.
గ్రామీణ స్థాయిలో ప్రజలు పడే కష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర సహాయ పడిందని చెప్పారు. ప్రజల కష్టాలను ఎలా తీర్చాలనే విషయంపై తనకు స్పష్టత ఉందని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే అధికార పార్టీ నాయకులు పోలీసులతో దౌర్జన్యానికి దిగుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలు ధర్మానికి, డబ్బుకుచ విశ్వసనీయతకు, మోసానికి మధ్య జరిగే ఎన్నికలని అన్నారు. 2014లో చంద్రబాబు మొదటి సినిమా చూపించారని, అధికారంలోకి వచ్చిన తరువాత మరో కొత్త సినిమాను చూపిస్తున్నారని జగన్ చురకలంటించారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారని, చివరికి తన కుమారుడికి మంత్రి పదవి అనే ఉద్యోగం ఇచ్చారని చెప్పారు.
600 హామీలను ఇచ్చిన చంద్రబాబు, నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని, ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి, తన వల్ల కాదని చేతులు ఎత్తేశారని చెప్పారు. నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీలో నిల్చున్న చంద్రబాబు.. అదే అసెంబ్లీలో ప్రధాని మోడీని కీర్తించ లేదా? అని ప్రశ్నించారు. మోడీ అంతటి ప్రధాని దేశ రాజకీయాల్లోనే లేరని ప్రశంసించారని, హోదాకు బదులుగా ప్యాకేజీని ఇస్తామని ప్రకటించిన అరుణ్ జైట్లీకి ధన్యావాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేయలేదా? అని నిలదీశారు.