మరో వైసీపీ ఎమ్మెల్యేకు సోకిన వైరస్: కరోనా పేషెంట్ల అంత్యక్రియల్లో పాల్గొన్న కొద్దిరోజుల్లో
తిరుపతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కరోనా బారిన పడ్డ మరుసటి రోజే.. తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో భూమన తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కో ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్గా పనిచేస్తున్నారాయన.
భూమన కుమారుడు అభినయ్ రెడ్డి ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్గా తేలారు. కరోనా వైరస్ పేషెంట్ల మృతదేహాల అంత్యక్రియల్లో ఆయన చురుగ్గా పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఆ మృతదేహాలను అమానవీయంగా అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తోన్నాయి. అలాంటి పరిస్థితిని నివారించడానికి భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు.
కొద్దిరోజుల కిందటే తిరుపతి కరకంబాడిలోని గోవిందధామంలో మృతదేహాలకు ఆయన దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించారు. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి శ్మశానంలో ఆయన కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ వరుస ఘటనలు చోటు చేసుకున్న అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, జ్వరంతో బాధపడ్డారు. ఆయనకు పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీనితో ఆయన రూయా ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్యం బాగుందని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందొద్దని అన్నారు.
తిరుపతి సహా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం.. చిత్తూరు జిల్లాలో 24 గంటల వ్యవధిలో 967 నాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 31,292కు చేరుకున్నాయి. 22126 మంది డిశ్చార్జి అయ్యారు. 8814 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటిదాకా కరోనా బారిన పడ్డి చిత్తూరు జిల్లాలో 352 మంది మరణించారు. తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు.