తిరుపతి బరిలో ప్రధాన పార్టీల అభ్యర్ధులు వీరే- గట్టిపోటీతో ముందస్తు ఏర్పాట్లు...
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక తిరుపతి పార్లమెంటు స్ధానంలోనే. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్ధానంలో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఇందుకోసం ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించగా.. త్వరలో బీజేపీ-జనసేన కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్ధులు దాదాపు ఖరారు కావడంతో ఈ ఉప ఎన్నిక ఏ రేంజ్లో జరగబోతోందో ఇట్టే అర్ధమవుతోంది.
తిరుపతి బరిలో హోరాహోరీ...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ అంతా సజావుగానే సాగిపోయింది. వైసీపీ పాలనలో సగం కరోనాకే సరిపోవడంతో ఇక మిగిలిన సమయంలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలకు అవకాశం దొరికింది. ఇందులోనూ మూడు రాజధానుల ప్రక్రియను నెత్తికెత్తుకోవడంతో ఇక మిగిలిన అంశాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఇది కాస్తా కోర్టులో ఆలస్యం అవుతుండటంతో తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే తిరుపతిలో సొంత ఎంపీ దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో వైసీపీ ప్రభుత్వానికి ఈ సీటు నిలబెట్టుకోవడం ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఇదంత కష్టమేమీ కాకపోయినా ఉప ఎన్నికల్లో ఉండే ప్రత్యేక పరిస్ధితులే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి సవాల్గా మారుతున్నాయి. విపక్ష టీడీపీతో పాటు బీజేపీ-జనసేన కూటమి అభ్యర్ధులు రంగంలోకి దిగుతుండటంతో పరిస్ధితి మరింత హీటెక్కింది.
తిరుపతిలో వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు ఖరారు..
తిరుపతి ఉప ఎన్నికలో ఉండే ప్రత్యేక పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ వైసీపీతో పాటు ప్రధాన విపక్షం టీడీపీ కూడా ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేశాయి. వైసీపీ తరఫున సీఎం జగన్ వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు గురుమూర్తి, టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన పనబాక లక్ష్మి అభ్యర్ధిత్వాలు ఖరారయ్యాయి. గత ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్కు గట్టిపోటీ ఇచ్చినా పనబాక లక్ష్మికి ఓటమి తప్పలేదు. గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పనబాక వాస్తవానికి తిరుపతిలో గట్టి అభ్యర్ధే. అయితే కీలకమైన తిరుపతితో పాటు ఇతర నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలే ఆమె విజయావకాశాలను ప్రభావితం చేయబోతున్నాయి. వైసీపీ అభ్యర్ధి అయిన గురుమూర్తికి మాత్రం జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ శ్రేణుల అండతో పాటు అధికార పార్టీ నుంచి పూర్తి సహకారం లభించబోతున్నాయి. చివరికి గురుమూర్తి ఎన్నికల ఖర్చు కూడా భరించేందుకు సీఎం జగన్ సై అన్నారు.
బీజేపీ-జనసేన అభ్యర్ధిగా రావెల కిషోర్బాబు
తిరుపతిలో ఉండే ప్రత్యేక పరిస్ధితులను సొమ్ముచేసుకుటూ ఈసారి ఎలాగైనా అక్కడ పాగా వేయాలని పట్టుదలగా ఉన్న బీజేపీ-జనసేన కూటమి ఒకప్పుడు టీడీపీలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్బాబును రంగంలోకి దింపబోతోంది. మాజీ ఐఆర్ఎస్ అధికారి కూడా అయిన రావెల పేరును బీజేపీ-జనసేన కూటమి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. పనబాకతో పాటు గురుమూర్తికి గట్టిపోటీ ఇచ్చేందుకు రావెలను మించిన అభ్యర్ధి లేడని కూటమిలోని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. అయితే ధనప్రవాహం ఫలితాలను శాసించే అవకాశమున్న తిరుపతి ఉప ఎన్నికల్లో ఒకప్పటి జనసేన నేత, ప్రస్తుత బీజేపీ నేత అయిన రావెల ఏ మేరకు నెగ్గుకొస్తారో చూడాల్సిందే.రావెల గెలుపు కోసం బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ఘన్రెడ్డి ఇప్పటికే తిరుపతిలో పాగా వేశారు.
Recommended Video
తిరుపతిలో వైసీపీ గెలవాల్సిందే...
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక, తమ సిట్టింగ్ సీటు కూడా కావడంతో తిరుపతిలో గెలవక తప్పని పరిస్ధితి వైసీపీది. సాధారణంగా చూసుకుంటే తిరుపతిలో వైసీపీ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. వైసీపీ గెలుపు కోసం మంత్రులు, అధికార పార్టీ నేతలు, జిల్లా నేతలు ఇలా అందరూ అండగా ఉంటారు. కానీ ఉప ఎన్నికల్లో ఉండే ప్రత్యేక పరిస్ధితులు, జగన్ ఏడాదిన్నర పాలనకు రెఫరెండంగా విపక్షాలు చేసే ప్రచారం. విపక్షాల తరఫున పనబాక, రావెల వంటి అభ్యర్ధులు రంగంలో ఉండటం వైసీపీపై ఒత్తిడి పెంచే అవకాశముంది. వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్న గురుమూర్తి రాజకీయాలకు కొత్త కావడం, ప్రచారంలో జగన్, షర్మిలతో కలిసి తిరిగిన అనుభవం మాత్రమే ఉండటంతో ఆయన ప్రసంగాలు కూడా ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది. దీంతో సహజంగానే వైసీపీకి ఈ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారబోతోంది.