పడవలో ఆడుకుంటూ నీళ్ళలో పడిన 10 మంది చిన్నారులు .. 9 మంది సేఫ్, ఒక బాలుడు మృతి
కృష్ణా జిల్లాలో ఓ పడవ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని దాములూరు గ్రామంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న పడవెక్కి ఆడుకుంటున్న పిల్లలు పడవ బోల్తా పడడంతో నదిలో పడిపోయారు. నీళ్లల్లో పడిన 10 మంది చిన్నారులను కాపాడటం కోసం స్థానిక రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. పడవలో ఉన్న మొత్తం 10 మందిలో తొమ్మిది మందిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకు రాగా, ఒక బాలుడు మరణించినట్లుగా తెలుస్తుంది. గల్లంతైన బాలుడి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
నది ఒడ్డున ఉన్న పడవెక్కి పిల్లలు ఆడుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అది పక్కకు ఒరగటంతో ఒక్కసారిగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పడవలో ఉన్న పది మంది పిల్లలు నీళ్లల్లో పడిపోయారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీళ్లు ఎక్కువగా ఉండడంతో వారంతా నీళ్ళల్లో మునిగి పోయారు. 10 మంది చిన్నారులు నీటిలో మునిగిపోయిన ఘటన స్థానికంగా అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఇక చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ పిల్లల కోసం బోరున విలపించారు.
Recommended Video
అయితే వెంటనే ఈ ఘటన సమాచారం అందుకున్న గ్రామపంచాయతీ అధికారులు, పోలీసులకు స్థానిక రెస్క్యూ టీం కు సమాచారం అందించడంతో తొమ్మిది మందిని కాపాడగలిగారు. నీటిలో పడిన 10 మంది చిన్నారులలో ఐదు సంవత్సరాల వయసున్న నడ కుదటి సర్వాన్ ఆనంద్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతని మృతదేహం కోసం నదిలో గాలింపు చేపట్టారు.