రాజ్భవన్లో కరోనా కలకలకం... 15 మంది సెక్యూరిటీ సిబ్బందికి పాజిటివ్...
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో 15 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఒక్కసారి ఇంతమందికి కరోనా సోకడంతో రాజ్భవన్లో కలకలం రేగింది. దీంతో ఆ 15మంది సహా మొత్తం 72 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఉన్నతాధికారులు మార్చారు. ఇప్పటికే రాజ్భవన్లో పనిచేసే పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు.
కాగా,ఏపీలో బుధవారం(జూలై 29) ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 70,584 నమూనాలను పరీక్షించగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 65 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. మరో 2,784 మంది కరోనా నుంచి కోలుకోగా... ఇప్పటివరకూ మొత్తం 55,406 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
గడిచిన 24గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో తూర్పుగోదావరిలో 14, అనంతపురం 8, విజయనగరం 7, చిత్తూరు 6, కర్నూలు, నెల్లూరులో ఐదుగురు చొప్పున, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, కడపలో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.