విజయవాడ అగ్నిప్రమాదంలో ట్విస్టులు: ఊపిరి ఆడక..ముగ్గురి ఉసురు పోయింది: బాధిత కుటుంబాలు
విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో వెనుక ఊహించని వాస్తవాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటిదాకా తొమ్మిది మరణించారు. పలువురు కరోనా వైరస్ పేషెంట్లను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రక్షించగలిగారు. మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం.. ఊపిరి ఆడకపోవడమేననే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
లీజులో స్వర్ణ ప్యాలెస్ హోటల్: కోవిడ్ ఆసుపత్రిగా: ప్రమాదంపై జగన్ ఆరా
వెంటిలేషన్ లేకుండా..
కోవిడ్ కేర్ సెంటర్గా ఏర్పాటైన స్వర్ణ ప్యాలెస్ నిజానికి ఓ హోటల్. లాక్డౌన్ పరిస్థితుల తరువాత ఆశించిన స్థాయిలో సందర్శకులు లేకపోవడం వల్ల ఇది మూత పడే దశకు చేరుకోగా.. దీన్ని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తాత్కాలికంగా లీజుకు తీసుకుందని అంటున్నారు. లీజుకు తీసుకున్న ఈ భవనంలో కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఆసుపత్రి నిబంధనలకు అనుగుణంగా ఇందులో మార్పులు, చేర్పులు చేయలేదు. ఫలితంగా- అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ప్రాణాలతో బయటపడే అవకాశం లేకుండా పోయిందని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
కొన్ని గదుల్లో ఫిక్స్డ్ విండోస్
అగ్నికీలలు చోటు చేసుకున్న వెంటనే భవనం మొత్తం వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో తొలుత మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో ఫస్ట్ ఫ్లోర్కు అగ్నికీలలు వ్యాపించాయి. మృతుల కుటుంబీకుల వాదనల ప్రకారం.. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగిన విషయం తెలిసినప్పటికీ.. పేషెంట్లు గానీ, సిబ్బంది గానీ వెంటనే బయటికి రాలేకపోయారు. గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్లడానికి ఒకే ఒక్క మార్గం ఉండటం, అది మంటల్లో చిక్కుకోవడం వల్ల బయటికి రాలేకపోయారు. ఫలితంగా వారంతా కిటికీ అద్దాలను తెరచుకుని బయటికి వచ్చారు. కొన్ని గదుల్లో మాత్రం ఆ అవకాశం లేదని, ఏసీ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఫిక్స్డ్ విండోస్లను అమర్చారని చెబుతున్నారు.
మరో దారి లేక..
హోటల్ భవనంలోనికి ప్రవేశించడానికి మరో దారి లేకపోవడం వల్ల అగ్నిమాపక సిబ్బంది తమ వాహనాల్లో అమర్చిన నిచ్చెనల ద్వారా బాధితులను కిందికి దించారని చెబుతున్నారు. ప్రధాన ద్వారం నుంచి లోనికి వెళ్లడానికి ఏ మాత్రం వీలు చిక్కకపోవడం వల్ల అగ్నిమాపక సిబ్బంది ల్యాడర్లను వినియోగించాల్సి వచ్చిందని వాదన సంఘటనా స్థలంలో వినిపిస్తోంది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ నష్ట పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తామని వెల్లడించింది.
Recommended Video
తొమ్మిదికి చేరిన మరణాలు
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొదట నలుగురు మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం ఈ సంఖ్య ఏడుకు పెరిగింది. తాజాగా మరో ఇద్దరు మరణించారు. ఆ ఇద్దరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలను వదిలారు. దీనితో స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.