3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడమే లక్ష్యం, ప్రజాభీష్టం మేరకు రాజధానులు: మంత్రి కొడాలి నాని
అభివృద్ధి ఒకేచోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల అంశాన్ని సీఎం జగన్ తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాజధాని కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
పవన్ కల్యాణ్ స్వరం మారింది, చంద్రబాబు కన్నా బాధ ఎక్కువే, 3 రాజధానులపై : మంత్రులు కన్నబాబు, నాని
వెనుకబడిన ప్రాంతాలు..
రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయని మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు. ఒకేచోట అభివృద్ది జరిగితే మిగతా ప్రాంతాలు వివక్షకు గురవుతాయని చెప్పారు. మూడు రాజధానులపై ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. అమరావతిలో అసెంబ్లీతోపాటు ప్రభుత్వ భవనాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నెలకొల్పుతామని చెప్పారు.
విశాఖలో సచివాలయం
విశాఖపట్టణంలో సచివాలయం నిర్మిస్తామని చెప్పారు. దీంతో ఉత్తరాంధ్ర డెవలప్ జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఉంటే బాగుంటుందనే డిమాండ్ వస్తోందని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును క్యాపిటల్ సిటీ చేయాలనే డిమాండ్ వినిపించిందని చెప్పారు. రాజధాని నిర్మాణం జరగకపోవడంతో హైకోర్టు ఏర్పాటు చేసి.. జ్యుడిషీయల్ క్యాపిటల్ సిటీ నిర్మించే వెసులుబాటు దక్కిందని చెప్పారు.
కర్నూలులో హైకోర్టు
కర్నూలులో హైకోర్టు నిర్మించాలని న్యాయవాదులు గత 97 రోజుల నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా ఉద్యమిస్తున్నారని మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు. వారి పోరాటం న్యాయమైనదని, అందుకే కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశం వైసీపీ నేతలే కాదు.. టీడీపీ నేతలు కూడా స్వాగతిస్తున్నారని కొడాలి నాని తెలిపారు.
కమిటీ నివేదిక తర్వాతే
మూడు రాజధానులపై కమిటీ నివేదిక తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాక.. ప్రభుత్వం కూడా ఫీడ్ బ్యాక్ తీసుకొని.. మార్పు చేర్పులతో రాజధానుల ఏర్పాటుపై ప్రకటన చేస్తామని కొడాలి నాని సంకేతాలు ఇచ్చారు.