ముగిసిన 48 గంటల డెడ్ లైన్.. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు సవాల్ డోంట్ కేర్ అన్న వైసీపీ
ఏపీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు మాటలను వైసిపి నేతలు లెక్కచేయడం లేదు. చంద్రబాబు వేదన, వైసీపీ ప్రభుత్వ పాలన పై ఆయన వ్యక్తం చేస్తున్న ఆక్రోశం అరణ్యరోదనగా మారుతున్న పరిస్థితులు మొదటినుంచి కనిపిస్తున్నాయి. ఇక తాజాగా మూడు రాజధానుల విషయంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసిపి ప్రభుత్వం తాను అనుకున్నదే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
చంద్రబాబు వ్యాఖ్యలను లెక్క చెయ్యని వైసీపీ
చంద్రబాబు నాయుడు ఎన్ని సవాళ్లు చేసినా, ఎంతగా విమర్శించినా వైసిపి ప్రభుత్వ వైఖరి మాత్రం వియ్ డోంట్ కేర్ అన్నట్టుగానే సాగుతుండడం గమనార్హం. 3 రాజధానుల పై ప్రజా తీర్పు కోరండి. ప్రజలు మీకు మద్దతు ఇస్తే మేమిక మాట్లాడమని, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పు కోసం వెళ్లాలని ఎన్నికల ముందు రాజధాని మార్చే విషయాన్ని ప్రస్తావించని వైసిపి ఇప్పుడు మోసపూరితంగా రాజధాని మార్చిందని పేర్కొన్న టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ కు 48 గంటల సమయం ఇస్తున్నానని పేర్కొన్న విషయం తెలిసిందే.
48 గంటల సమయం జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన చంద్రబాబు
చంద్రబాబు తాను ఇచ్చిన గడువులోపు జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని లేదంటే ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు అన్ని వాస్తవాలను, గణాంకాలను పెట్టి నమ్మకద్రోహులను నడివీధిలో నిలబెడతా అని పేర్కొన్నారు. చంద్రబాబు సవాల్ విషయంలో వైసిపి ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించలేదు. చంద్రబాబు మాటలను పట్టించుకోనట్టు వ్యవహరించింది. వైసిపి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో చంద్రబాబు మాట అంటే లెక్కే లేదు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల విమర్శలను పట్టించుకునే పరిస్థితి లేదనే భావన వ్యక్తం అవుతుంది .
బాబు ఏం చేసినా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టేనా ?
అసెంబ్లీని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోరాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన 48గంటల డెడ్లైన్ ముగియడంతో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనే అంశంపై ఆసక్తి సర్వత్రా నెలకొంది. బాబు ఏం చేసినా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టేనా అన్న భావన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలుగుతుంది . చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినా , ఏం చేసినా , ఎంతగా విమర్శించినా అవేవీ పట్టించుకోని వైసీపీ తీరు టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది . కొందరు వైసిపి నేతలు నేతలు మాత్రం అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే లేదని చెబుతున్నారు.
Recommended Video
సైలెంట్ గా తనపని చేసుకుపోతున్న వైసీపీ
ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పిన మాటలకు ఏం సమాధానం చెబుతారన్నదానిపై అమరావతి కూడా రాజధానిగా ఉంటుంది కదా అంటూ వైసీపీ ప్రభుత్వం చేసిన దాన్ని సమర్థించుకుంటున్నారు. చంద్రబాబు సవాల్పై ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించలేదు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు గుప్పించినా వైసీపీ మాత్రం సైలెంట్గా ఉంది. తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తూ తనపని తాను చేసుకుపోతుంది .