60 శాతం మార్కెట్ ఇక్కడినుంచే.. ఈవెంట్స్ నిర్వహించాల్సిందే: సాయిరెడ్డి
వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి.. ఈ సారి సినిమాల గురించి మాట్లాడారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తోన్న సమయంలో.. దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఏపీలోనే మార్కెట్ ఎక్కువ అని తెలిపారు. అలాంటి సమయంలో.. ఆ చోట వేడుకలు కచ్చితంగా జరుపుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏపీలో నిర్వహించడం ట్రెండ్ అవుతుంది. కొద్ది రోజుల కింద చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఘనంగా జరిగింది. నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏపీలోనే జరిగింది. యువ సామ్రాట్ నాగార్జున చిత్రం 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఆ సినిమా యూనిట్కు అభినందనలు తెలిపారు.
అంతేకాదు టాలీవుడ్ చిత్రాలకు 60 శాతం మార్కెట్ ఏపీనే అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అందువల్ల హీరోలు, నిర్మాతలు చొరవ తీసుకుని సినిమా ఈవెంట్లు, షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇక్కడే నిర్వహించాలని కోరారు. దీంతో మరింత మార్కెట్ పెరుగుతుందని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరనుంది.
తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్లోనే మెజార్టీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకోసమే.. ఏపీలో ఈవెంట్లు నిర్వహించాలని వినతులు వస్తోన్నాయి.