రాజధాని గ్రామంలో రైతు ఆత్మహత్యా యత్నం: రాజధాని తరలింపు ఆవేదనతో..! పెట్రోలు పోసుకొని..!
ఏపీలో మూడు రాజధానులు..సచివాలయం తరలింపు..జీఎన్ రావు కమిటీ సిఫార్సులతో ఆవేదన వ్యక్తం చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఉద్వేగానికి లోనవుతున్నారు. శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపి..ఇక లాంఛనంగా విశాఖ నుండి పరిపాలన సాగించేలా ప్రకటన చేయటానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఇదే సమయంలో రాజధాని గ్రామాల్లో భూములిచ్చిన రైతులు..
ఆందోళన తీవ్రతరం చేసారు. తాజాగా..మంగళగిరి మండలం పెనుమాకలో రైతులు రాజధానిని తరలించవద్దంటూ దీక్ష చేసారు. ఆ దీక్ష ముగిసిన తరువాత అదే గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు అక్కడి నుండి అందరూ వెళ్లిపోయిన తరువాత పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొనే ప్రయత్నం చేసారు. దీంతో..సమీపంలో ఉన్న వారు వెంటనే రమేష్ ఒంటి మీద నీళ్లు పోసి..నిప్పు అంటించుకోకుండా అడ్డుకున్నారు. ఆ వెంటనే పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేసారు.
ఆత్మహత్యాయత్నం చేసిన రమేష్ రాజధాని కోసం నాలుగు ఎకరాల భూమి ఇచినట్లు చెప్పారు. రాజధాని తరలింపు తట్టుకోలేక తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. అయితే, రాజధాని తరలింపు విషయంలో భూములిచ్చిన గ్రామాల్లోని రైతులు..వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం రైతులకు ఎటువంటి నష్టం లేకుండా వారికి గతంలో ఇచ్చిన హామీ మేరకు డెవలప్ చేసిన భూములను తిరిగి ఇస్తామని చెబుతోంది. ఇదే సమయంలో రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు సైతం రైతుల పక్షాన నిలుస్తామని..వారికి న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం రైతులతో సంప్రదింపుల కోసం మంత్రులతో కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది.
రైతులు మాత్రం తమకు రాజధాని ఇక్కడ కొనసాగించాలనే డిమాండ్ మాత్రమే అని చెప్పుకొస్తున్నారు. ఇక, రాజధాని పరిరక్షణ సమితి పేరుతో అన్ని సంఘాలు ఉద్యమానికి దిగాయి. లాయర్లు సైతం విధులు బహిష్కరించి.. హైకోర్టును తరలించవద్దని నినిదిస్తున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తానికి శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు. దీంతో..రాజధాని గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.