వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు..పోస్టులు: తెలంగాణ వాసి అరెస్ట్
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కొద్దిరోజుల కిందటే నకిలీ రైతు శేఖర్ చౌదరిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా తెలంగాణకు చెందిన నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడకు తీసుకొచ్చారు. నిందితుడు నవీన్ కుమార్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఉపాధి కోసం ఆయన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ లో స్థిరపడ్డారు.
అజ్ఙాతవాసి..ప్రయాణం ఎక్కడికి? శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భార్యతో పవన్ కల్యాణ్!
అక్కడి మహికో పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట వైఎస్ జగన్ పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజయవాడ సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. నవీన్ కుమార్ గౌడ్ ఎక్కడ ఉన్నది గుర్తించారు. వెంటనే సీఐడీకి చెందిన ముగ్గురు పోలీసులు కాళ్లకల్ కు వెళ్లి.. ఆయనను అరెస్ట్ చేశారు. విజయవాడకు తీసుకొచ్చారు.
నకిలీ రైతు వేషం కట్టి వైఎస్ జగన్, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లను దూషించిన కేసులో జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కస్టడీ ముగియడంతో ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. తాజాగా- తెలంగాణకు చెందిన నవీన్ కుమార్ గౌడ్ ను అరెస్టు చేశారు.
వైఎస్ జగన్ పై అనుచితమైన, అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని హోం మంత్రి సుచరిత స్పష్టం చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే వరుసగా అరెస్టులు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.