ప్రేమించలేదని పెట్రోల్ పోసి యువతిని సజీవదహనం చేసిన యువకుడు ..విజయవాడలో దారుణ ఘటన
విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించ లేదన్న కోపంతో ఓ యువతి పై పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ మానవ మృగం. విజయవాడ హనుమాన్ పేట లో చోటు చేసుకున్న ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే చనిపోగా, పెట్రోల్ పోసిన యువకుడికి కూడా నిప్పంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
క్యాంపస్ లోకి లాక్కెళ్ళి విద్యార్థినిపై లైంగిక దాడి, వీడియోలు..పోలీసులు అక్కడే ఉన్నా యూపీలో దారుణం
ప్రేమించాలని వేధిస్తున్న యువకుడిపై ఫిర్యాదు చేసిన యువతి
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ లో విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి నర్స్ గా పనిచేస్తుంది. హాస్పిటల్ కు సమీపంలో ఓ రూమ్ అద్దెకు తీసుకుని స్నేహితురాళ్ళతో కలిసి ఉంటుంది. ఇదే క్రమంలో రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి కొద్దికాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. తనను ప్రేమించాలంటూ వేధింపులకు దిగుతున్నాడు. దీంతో అతని ప్రవర్తనతో విసిగి పోయిన చిన్నారి 4 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులకు ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న యువకుడు
పోలీసులు అతన్ని పిలిచి హెచ్చరించడంతో ఇకపై ఆమె వెంట పడను అని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో చిన్నారి తన కంప్లైంట్ ను వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం.తనను ప్రేమించడం లేదని, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న యువకుడు చిన్నారిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా పక్కా ప్లాన్ వేసి సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాడు.
పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు ...యువతి మృతి .. యువకుడికీ తీవ్ర గాయాలు
ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిన్నారి, నాగభూషణం చెబుతున్న విషయాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. అతనిని ప్రేమించలేనని చెప్పింది. దీంతో నాగభూషణం ముందుగానే ప్లాన్ చేసినట్లుగా తెచ్చుకున్న పెట్రోల్ ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెట్రోల్ పోసి నిప్పంటించిన క్రమంలో అతనికి మంటలు అంటుకున్నాయి. దీంతో నాగభూషణం కూడా 80% గాయపడ్డాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రస్తుతం నాగభూషణం కు చికిత్స అందిస్తున్నారు.నాగభూషణం పరిస్థితి విషమంగా ఉంది .
కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రేమించ లేదన్న కోపంతో పెట్రోల్ పోసి ఒక యువతిని దారుణంగా హతమార్చిన ఘటన ప్రస్తుతం విజయవాడలో కలకలం రేపుతోంది. బాలికల, మహిళల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా మృగాళ్లకు ఎలాంటి భయము లేదని ఈ ఘటనతో అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు ,హత్యలు దారుణంగా పెరుగుతూనే ఉన్నాయి .ఈ ఘటనలు సమాజంలో ఆందోళనకర పరిస్థితి తెచ్చి పెడుతున్నాయి .