పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి- రెండు కార్ల మధ్య బైక్- కార్యకర్తకు విరిగిన కాలు
కృష్ణాజిల్లాలో నివర్ తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన టూర్లో అపశృతి చోటు చేసుకుంది. భారీ హంగామాతో కార్లు, బైక్లతో ర్యాలీ నిర్వహిస్తుండగా.. అందులో రెండు కార్ల మధ్యలోకి ఓ బైక్ వెళ్లి ఇరుక్కోపోయింది. ఈ ఘటనలో జనసేన కార్యకర్త ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. అతనికి కాలు విరిగింది.
కృష్ణా జిల్లా పామర్రు వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ చేరుకున్న సమయంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్ ను కలిసేందుకు ఎగబడ్డారు.. బైక్లు నడుపుతూనే పవన్ ప్రయాణిస్తున్న వాహనం దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కార్యకర్తల బైక్లు ఒక దానికొకటి గుద్దుకున్నాయి. దీంతో ఓ బైక్పై ప్రయాణిస్తున్న కార్యకర్త రెండు కార్ల మధ్య పడ్డాడు. బైక్ ఇరుక్కుపోవడంతో అతని కాలు నలిగిపోయింది. తీవ్ర గాయాలైన అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు కార్యకర్తలను కూడా ఆస్పత్రికి తరలించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ తన పర్యటన కొనసాగించారు. కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలోని గ్రామాల్లోనివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించారు. తుపాను సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తన ఫ్యాంటు ఎత్తి మరీ పొలంలో దిగి పవన్ రైతులతో మాట్లాడరు. పంటలను స్వయంగా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం నుంచి సాయం అందేలా మాట్లడతానని వారికి హామీ ఇచ్చారు. దివిసీమ గ్రామాల నుంచి పవన్ గుంటూరు జిల్లా తెనాలి వెళ్లనున్నారు.