రాహుల్ గాంధీతో దోస్తీ ఎఫెక్టా?: ఆరెస్సెస్ను టార్గెట్ చేసిన చంద్రబాబు, తీవ్రవ్యాఖ్యలు
అమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిప్పులు చెరిగారు. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
దేశం.. సంఘ్ పరివార్ కుట్రల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఆరెస్సెస్ కుట్రలను బీజేపీ అమలు చేస్తోందని చెప్పారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు మంచి కోసం అయితే స్వాగతిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు గండికొడతామంటే ఎదిరిస్తామని చెప్పారు.
కాపు రిజర్వేషన్ల మాటేమిటి
ఇప్పటి వరకు సామాజిక వెనుకబాడుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆర్థిక వెనుకబాటు రిజర్వేషన్లను కొత్తగా తెచ్చారని బీజేపీపై మండిపడ్డారు. ఆర్థికంగా పేదలకు రిజర్వేషన్లను స్వాగతించాల్సిందే అన్నారు. కాపుల రిజర్వేషన్ల పైన కూడా డిమాండ్ చేయాలన్నారు. వాల్మికీ బోయలను ఎస్టీల్లో చేర్చడంపై ప్రశ్నించారని చెప్పారు.
జగన్కు ఆదిశేషగిరిరావు షాక్, ఎటువైపు?: వారంతా జనసేన వైపు చూస్తున్నారు కానీ!
మూర్ఖత్వం అవుతుంది
మనమంతా గ్రూపు విభేదాలను పక్కన పెట్టాలని చంద్రబాబు సూచించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వం అవుతుందని చెప్పారు. అవినీతిపరులే అవినీతిపై పుస్తకాలు వేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్ వల్ల ఎంతోమంది జైలుకు వెళ్లారని చెప్పారు.
జగన్ నోరు తెరవడం లేదే
కేంద్ర ఇచ్చే నిధులపై పవన్ కళ్యాణ్ వేసిన జయప్రకాశ్ నారాయణ కమిటి రూ.75వేల కోట్లు ఇవ్వాలని చెప్పిందని చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్రం ఇవ్వాల్సిన దానిపై జగన్ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. కాగా, ఇదివరకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఆరెస్సెస్ పైన పదేపదే నిప్పులు చెరిగేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన చంద్రబాబు కూడా అదే ఆరెస్సెస్ పైన విమర్శలు గుప్పించడం గమనార్హం.