యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం : పవన్ కళ్యాణ్
నల్లమల యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదివరకే యురేనియం తవ్వకాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత వీ హనుమంతరావుతో కలిసి చర్చించిన పవన్ కళ్యాణ్ మరోసారి యురేనియం తవ్వకాలపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే భావితరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా లేక కాలుష్యంతో కూడిన తెలంగాణ ఇస్తామా అంశాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.ఈనేపథ్యంలోనే నల్లమల యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన చెప్పారు. యురేనియం తవ్వకాల వల్ల వాతవరణంతో పాటు కృష్ణా జలాలు సైతం కలుషితం అవుతాయని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకుండా నల్లమల అటవీ సంరక్షణ కోసం జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమలలో ఉద్యమాలు ఉధృతం అవుతున్న విషయం తెలిసిందే, యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ ఓ వైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, రాజకీయ పారాటాలు, స్థానిక ప్రజలు ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు తవ్వకాలకు సంబంధించిన సన్నాహాలను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముమ్మరం చేసింది. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో 21 వేల ఎకరాల విస్తీర్ణంలో నమూనాల సేకరణకు కేంద్ర అణుశక్తి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని మొత్తం 83 కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యతలను తెలుసుకునేందుకు అనుమతిం చాలని తెలంగాణ అటవీ శాఖను కోరింది.